Visakha Steel : విశాఖ ఉక్క పరిశ్రమను ప్రైవేటు పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే,. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో వివిధ రాజకీయ పక్షాల నేతలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దీనిపై స్పందించారు. శనివారం ప్రధాన మంత్రి మోడీకి జగన్ లేఖ రాశారు. విశాఖ స్టీల్ కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణ పై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫ్యాక్టరీ బలోపేతం చేయడానికి మార్గాన్ని అన్వేషించాలని సూచించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ద్వారా సుమారు 20వేల మంది ప్రత్యక్షంగా, ఉపాధి పొందుతుండగా, వేలాది మంది పరోక్షంగా జీవనోపాధి పొందుతున్నారని పేర్కొన్నారు.
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాద వేదికగా ప్రజల పోరాట ఫలితంగా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు అయ్యిందన్నారు. దశాబ్ద కాలం పాటు ప్రజాపోరాటం జరిగిందనీ, ఆ పోరాటంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. 2002 నుండి 2015 మధ్య విశాఖ స్టీల్ ప్లాంట్ మంచి పనితీరు కనబరిచిందన్నారు. ప్లాంట్ పరిధిలో 19,700 ఎకరాల విలువైన భూములు ఉన్నాయని ఈ భూముల విలువే దాదాపు లక్ష కోట్ల వరకూ ఉంటుందని జగన్ పేర్కొన్నారు. ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్లాంట్ కు కష్టాలు వచ్చాయన్నారు,. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు లేవనీ, పేట్టుబడులు ఉపసంహరణకు బదులు అండగా నిలబడటం ద్వారా ప్లాంట్ ను మళ్లీ ప్రగతిబాటలోకి తీసుకువెళ్లవచ్చని అన్నారు. 7.3 మిలియన్ టన్నుల సామర్ధ్యం ఉన్నప్పటికీ 6.3 మిలియన్ టన్నులు మాత్రమే ఏడాదికి ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు డిసెంబర్ 2020 లో 200 కోట్ల లాభం కూడా వచ్చిందని గుర్తు చేశారు. వచ్చే రెండేళ్లలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్లాంట్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. బైలదిల్లా గనుల నుండి మార్కెట్ రేటుకు ముడి ఖనిజాన్ని ప్లాంట్ కొనుగోలు చేయడం వల్ల అదనపు భారం పడుతోందన్నారు. సెయిల్ కు సొంత గనులు ఉన్నాయని దాదాపు 200 ఏళ్లకు సరిపడా నిల్వలు సెయిల్ కు ఉన్నాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించడం ద్వారా పోటీ పరిశ్రమలతో సమాన స్థాయికి తీసుకువెళ్లవచ్చని అన్నారు. బ్యాంకుల నుండి తెచ్చుకున్న రుణాల మొత్తాన్ని వాటా రూపంలోకి మార్చితే ఊరట కలుగుతుందని సూచించారు. వడ్డీ రేటు కూడా తగ్గిస్తే ప్లాంట్ పై భారం తగ్గుతుందన్నారు.