Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసు కుంది. వివేకా హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కస్టడీ విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇటీవల సీబీఐ అధికారులు అరెస్టు చేసిన శివశంకరరెడ్డిని కోర్టులో హజరుపర్చగా మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. దీంతో ఆయన కడప సెంట్రల్ జైలులో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తులో కీలక విషయాలను రాబట్టేందుకు శివశంకర్ రెడ్డిని కస్టడీకి అనుమతించాలని కోరుతూ సీబీఐ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం వాదనలు విన్న అనంతరం ఏడు రోజులు కస్టడీకి అనుమతికి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కడప జైలులో ఉన్న శివశంకరరెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని డిసెంబర్ 2వ తేదీ వరకూ విచారించనున్నది.
వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో దేవిరెడ్డి శివశంకరరెడ్డి పేరు ఉంది. శివశంకరరెడ్డి.. ఎంపి అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాగా ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ వైసీపీ తరపున పులివెందుల పార్టీ వ్యవహారాలు చూస్తుండేవారు. శివశంకరరెడ్డిని సీబీఐ ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ లో అదుపులోకి తీసుంది. ఆయనను కోర్టుకు హజరుపర్చిన సమయంలో ఎంపి అవినాష్ రెడ్డి వచ్చి మాట్లాడారు. శివశంకరరెడ్డిని వివేకా హత్య కేసులో అరెస్టు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. అయితే వివేకాను హత్య చేస్తే శివశంకరరెడ్డి రూ.40కోట్లు ఇస్తాడంటూ ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్నాడు. దీంతో ఈ నెల 15వ తేదీన కడపలో విచారణకు హజరుకావాలని శివశంకరరెడ్డికి సీబీఐ సమాచారం ఇచ్చినా ఆయన హజరు కాలేదు. ఆరోగ్యం బాగోలేదంటూ పులివెందుల నుండి హైదరాబాద్ వెళ్లి ఓ ఆసుపత్రిలో చేరారు. దీంతో సీబీఐ బృందం హైదరాబాద్ లో ఆయనను ఓ ఆసుపత్రిలో అదుపులోకి తీసుకుంది. శివశంకర్ రెడ్డి సీబీఐ విచారణలో ఏం చెబుతారనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.