ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తిరుపతి అసెంబ్లీ. ఇక్కడ పోరు ఆసక్తిగా మారింది. వైసీపీ ముఖ్య నాయకుడు.. టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి ఇక్కడ తొలిసారి రంగంలోకి దిగారు. స్థానికంగా అభినయ్ రెడ్డి అందరికీ పరిచయమే. గతంలో తుడా బోర్డులోనూ సభ్యుడిగా పనిచేశారు. ఇక, గత 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి నుంచి కార్పొరేటర్గా విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన కార్పొరేటర్గా కొనసాగుతున్నారు.
అంతేకాదు.. తిరుపతి క్రికెట్ సంఘానికి అభినయ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇలా.. అటు జనంలోనూ.. ఇటు యువతలోనూ అభినయ్కు మంచి పేరు, ఫాలోయింగ్ కూడా ఉంది. దీనికి భూమన కరుణాకర్రెడ్డి మద్దతు మరింతగా కలిసివస్తోంది. ఇక, కూటమి పార్టీలైన టీడీపీ – జనసేన – బీజేపీ అభ్యర్థిగా.. జనసేన నుంచి ఆరణి శ్రీనివాసులు బరిలో ఉన్నారు. ఈయన ప్రత్యక్షంగా జనసేన నాయకుడే అయినా.. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత.. వైసీపీ నుంచి వచ్చి.. జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
పైగా ఆయన చిత్తూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కావడంతో తిరుపతి అసెంబ్లీకి కొత్తముఖమనే చెప్పాలి. ఇదే.. కూటమి పార్టీల్లోనూ మంటలు పెట్టింది. ఆరణికి సహకరించేది లేదని.. దాదాపు నెల రోజుల పాటు కూటమి పార్టీల నాయకులు ఆందోళనలు చేశారు. మౌనం వహించారు. దీంతో సాక్షాత్తూ..జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. నియోజకవర్గంలో పర్యటించి.. రెండు రోజులు అక్కడే బస చేసి.. క్షేత్రస్థాయిలో నాయకులను బుజ్జగించారు. కలిసి పనిచేయాలన్నారు. ఆరణిని గెలిపించాలని పిలుపునిచ్చారు.
అప్పుడు అధినేత ముందు ఓకే చెప్పిన నాయకులు.. తర్వాత.. మాత్రం యథాతథంగా ఇంటికే పరిమిత మయ్యారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, జనసేన నాయకుడు కిరణ్ రాయల్ వంటివారు.. ఇంటి నుంచి బయటకు ఇప్పటి వరకు రాలేదు. వీరిద్దరూకూడా టికెట్లు ఆశించిన వారే. దీంతో ఇప్పుడు మాజీ వైసీపీ నాయకుడి జైకొట్టలేమంటూ.. వారు తమ అనుచరుల వద్ద ఇప్పటికీ చెబుతున్నారు. దీంతో ఆరణి గెలుపు అంత ఈజీ అయితే కాదని అంటున్నారు పరిశీలకులు. ఎంతో శ్రమించి.. పవన్ వంటివారు ఇక్కడే కూర్చుని ప్రచారం చేస్తే.. తప్ప ఆరణి విషయంపై ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి ఏర్పడడం గమనార్హం.