ఢిల్లీలో ఏదో జరుగుంది. లేకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్ ని పిలవడం ఏంటి..? ఆ వెంటనే ఏపీ సీఎం జగన్ కి పిలుపు రావడం ఏంటి..? ఇప్పుడు మళ్ళీ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కి ఎల్లుండి అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంటి..? కేంద్రంలో ఒక కదలిక మొదలయింది. వ్యవసాయ బిల్లులపై దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న వేళ… రెండు రోజుల్లో దేశం మొత్తం ఉద్యమం ఉదృతం చేయాలని నిర్ణయించిన వేళ.. అమిత్ షా ఇలా వరుసగా సీఎంలను పిలిపించుకుని మాట్లాడుతుండడం మాత్రం గమనించాల్సిన అంశమే..! రైతుల ఉద్యమాలు అనుకూలంగా నిర్ణయాలు మార్చుకుంటున్న సీఎంలుతో అమిత్ షా ఒక క్లాస్ తీసుకుంటూనే, వారి అభిప్రాయాలు తీసుకుని బిల్లులకు సంస్కరణలకు ఆలోచిస్తున్నట్టు సమాచారం.
రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది – కేంద్రం ఏం చేయాలి..!?
ఎస్..! బీజేపీ ఇప్పుడు తెలుసుకోవాల్సిన కీలక అంశం ఇదే. రైతులు చేస్తున్న ఉద్యమం క్షేత్రస్థాయిలో ఎలా ఉంది..? ఎంత మేరకు మద్దతు లభిస్తుంది..? ఎంత మేరకు రైతులు పాల్గొంటున్నారు..? అనే అంశాలు కావాలి. ఇవి తెలుసుకోవడం సులువే. కేంద్రానికి ఉన్న ప్రత్యేక నిఘా సంస్థలు ద్వారా తెలుసుకుంటారు..! కానీ రాజకీయం ఎంత మద్దతు ఉంది..? ఏ పార్టీలు ఎలా మద్దతు ఇస్తున్నాయి..? ఏ పార్టీల ఉద్దేశం ఏమిటి..? రాష్ట్రాల అధికార పార్టీల వైఖరి ఎలా ఉంది అనేది మాత్రం బీజేపీ తెలుసుకోలేదు. బిల్లు ప్రవేశ పెట్టక ముందు చేయలేదు. తీరా దేశం మొత్తం ఉద్యమం జరిగి, ఇప్పుడు కొంప కొల్లేరయ్యే పరిస్థితి వస్తుండడంతో ఇప్పుడిప్పుడే కేంద్రం అలెర్ట్ అయింది. బిల్లు ఆమోదానికి ముందే సీఎంలను కాకాపట్టడమో, బెదిరించడమో చేయాల్సిన కేంద్రం ఇప్పుడు ఆ పని చేస్తుంది. అందుకే ఈ వరుస పిలుపులు. రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి..? కేంద్రం ఏం చేయాలి..? అనేది నిర్ధారించుకునే క్రమంలో ఈ పిలుపులు.
రైతులతోనూ మరో దశలో..!!
ఢిల్లీలో రైతుల ఉద్యమం తీవ్రమవుతుంది. కేంద్రం వారితో చర్చలకు సిద్ధమవుతోంది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతు సంఘాలు తమ వాణిని మరింత బలంగా వినిపించడానికి సిద్ధమవుతున్నాయి. చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందే అంటూ పట్టుపడుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం బుధవారం దిల్లీ-నోయిడా మధ్య చిల్లా సరిహద్దును పూర్తిగా స్తంభింపజేస్తామని ప్రకటించాయి. ‘చట్టాలను రద్దు చేసేది లేదని కేంద్రం చెబుతోంది. ప్రభుత్వం వాటిని రద్దు చేసేలా చేస్తామని మేం చెబుతున్నాం. ఉద్యమం అలాంటి దశకు చేరింది’ అని రైతుల నేత జగ్జీత్ దల్లేవాల్ చెప్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లు విని, నిర్దిష్ట ప్రతిపాదనలతో ముందుకు రావాలని కోరుతున్నారు. రైతులకు మద్దతుగా దాదాపు 2000 మంది వరకు మహిళలు దిల్లీ సరిహద్దులకు రాబోతుండగా ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్కు చెందిన కుల సంఘాల (ఖాప్ పంచాయతీల) అధ్యక్షులు ఈ నెల 17న ఉద్యమ స్థలానికి చేరుకోనున్నారు.