ఏపిలో తాజా రాజకీయ పరిణామాలు టీడీపీకి షాక్ ఇచ్చినట్లుగానే కనిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో అధికార వైసీపీని ఎదుర్కొవాలంటే ఒక్క టీడీపీ వల్ల సాధ్యం కాదనీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటేనే సాధ్యం అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఆ విధంగానే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. అందుకే జనసేన, బీజేపీతో దగ్గర అయ్యేందుకు టీడీపీ తంటాలు పడుతోంది. ఓ విధంగా టీడీపీతో కలిసి వైసీపీని ఎదుర్కొనేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంసిగ్దత వ్యక్తం చేస్తున్నా కేంద్రంలోని బీజేపీ అందుకు ససేమిరా అంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు సూచనల మేరకే పవన్ కళ్యాణ్ విశాఖలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారన్న ప్రచారం కూడా ఉంది. అయితే ప్రధాని మోడీతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో అంత హుషారుగా మాట్లాడకపోవడం, ముభావంగా రెండు మాటలు చెప్పి వెళ్లడంతో జగన్మోహనరెడ్డి పాలనపై మోడీ అంతగా వ్యతిరేకత వ్యక్తం చేయలేదన్న మాటలు వినబడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ మోడీ వద్ద పలు విషయాలను ప్రస్తావిస్తే ఆయన అంత సీరియస్ గా పరిగణించకుండా అన్ని విషయాలు తనకు తెలుసు అన్నట్లుగా మాట్లాడారని అంటున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కూడా తన ప్రసంగంలో ప్రభుత్వానికి, సీఎం జగన్మోహనరెడ్డికి వ్యతిరేకంగా ఏమీ కామెంట్స్ చేయకపోవడం కూడా ఇందుకు ఉదాహారణగా నిలుస్తొందని అంటున్నారు. తెలంగాణలో సీఎం కేసిఆర్, టీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపి పర్యటనలో సీఎం జగన్ కు అనుకూలంగా వ్యవహరించినట్లుగా చెబుతున్నారు. ఒక రకంగా విశాఖలో మోడీ బహిరంగ సభ విజయవంతానికి వైసీపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి సక్సెస్ అయ్యింది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేంద్రంతో సన్నిహిత సంబందాలనే కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్యసభలో కీలక బిల్లుల సమయంలో వైసీపీ ఎంపీలు మద్దతు ఇస్తున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీఏ అభ్యర్దులకే వైసీపీ మద్దతు ఇచ్చింది.
ఇదే క్రమంలో రాష్ట్రానికి అవసరమైన మేరకు అప్పులు చేసేందుకు కేంద్రం సహకరిస్తూనే ఉంది. అనధికార మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న వైసీపీని దూరం చేసుకునేందుకు కేంద్రంలోని ఎన్డీఏ సిద్దంగా లేదు అన్న టాక్ కూడా వినబడుతోంది. గత ఎన్నికలకు ముందు బీజేపీపై, ప్రధాని మోడీపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో చేసిన విమర్శలు, ఆనాడు పలు ప్రాంతీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ తో చేతులు కలిపి చేసిన రాజకీయం కేంద్ర బీజేపీ మరవలేదని అందుకే చంద్రబాబుకు డోర్ లు మూసివేసినట్లుగా చెబుతున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో సహా రాష్ట్ర పార్టీ వ్యవహరాల సహ ఇన్ చార్జి సునీల్ థియేధర్ కూడా పలు సందర్భాల్లో టీడీపీతో పొత్తు ప్రసక్తేలేదని, జనసేనతోనే తమ పొత్తు కొనసాగుతుందని వెల్లడించారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం మాదిరిగానే కేంద్రంలోని బీజేపీ కూడా చంద్రబాబుకు దగ్గర అయ్యేందుకు సిద్దంగా లేదు అన్నట్లుగా మోడీతో పవన్ భేటీ అనంతరం సంకేతాలు వెలువడినట్లు తెలుస్తొంది. ఈ పరిణామాలు అన్నీ చంద్రబాబుకు షాక్ కల్గించేవిగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.