central government : కేంద్ర ప్రభుత్వం central government ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఒకే రోజు రెండు షాక్ లు తగిలాయి. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో రాష్ట్ర వాటా లేదని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చేస్తే.. రామాయపట్నం పోర్టు కేంద్రం పరిధిలో లేదని, మేజర్ పోర్టులకు మాత్రమే సాయం చేస్తామని
నౌకాయాన శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ తేల్చేశారు. దీంతో ఏపీపై కేంద్రం వైఖరి ఇలా ఉంది అనేకంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రకటనలతో ఇరుకున పడిందని చెప్పాలి. నిర్మలా సీతారామన్ ప్రకటనతో విశాఖలో ఉద్యమం మరింత ఉధృతమైంది. రామాయపట్నం పోర్టు విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆలోచనలో పడింది.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో కాస్త సన్నిహితంగా ఉంటోంది వైసీపీ. పలుమార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి విన్నపాలు చేస్తున్నారు. కానీ.. కేంద్రం ఏపీ విషయంలో చేయాల్సింది చేసేస్తోంది. ఏపీ విజ్ఞప్తుల్ని పక్కన పెట్టేస్తోంది.
ఉక్కు కర్మాగారం విషయంలో పవన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాకు లేఖ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ లేఖ రాశారు. టీడీపీ నాయకులు విశాఖలో ధర్నాలు చేశారు. కార్మికులు ఇంకా ఆందోళన చేస్తున్నారు. ఇవేమీ పట్టని కేంద్రం.. అసలు విశాఖ ఉక్కులో రాష్ట్రానికి సంబంధం లేదు.. 100 శాతం ప్రైవేటీకరణ జరుగుతుందని తేల్చేశారు.
గతంలో విభజన చట్టంలో దుగరాజపట్నం పోర్టుకు నిధులు ఇస్తామంటే.. రామాయపట్నం పోర్టు పేరు చేర్చారు. ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు ప్రదేశం ఉన్నా.. భూసేకరణ ఎక్కువగా నెల్లూరు జిల్లాలో జరిగింది. పైగా.. పోర్టును నాన్ మేజర్ పోర్టుగా డీగ్రేడ్ చేస్తూ గత ఏడాది నోటిఫికేషన్ ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. కేంద్రానికి భాగస్వామ్యం లేకుండా పోర్టు నిర్మాణాన్ని తామే చేపడతామని చెప్పుకొచ్చింది.
కొన్ని పనులను అరబిందో రియాల్టీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు అప్పజెప్పినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం నిర్ణయంతో మొత్తం భారం వైఎస్ జగన్ ప్రభుత్వంపై పడింది. కేంద్రం నిర్ణయాలపై మొత్తంగా ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో చూడాలి..!