ఆవేశ నిర్ణయాలు కొన్ని వెనక్కు తీసుకోక తప్పదు. అనుభవ పూర్వకంగా కొన్ని అంగీకరించక తప్పదు. నాడు వద్దు అనుకున్నవే నేడు కావాలి అనుకోవచ్చు.., నాడు కావాలి అనుకున్నవి నేడు వద్దు అనుకోవచ్చు..! సీఎం జగన్ పరిస్థితి కొన్ని అంశాల్లో ప్రస్తుతం అలాగే మారింది. ముఖ్యంగా శాసనమండలి విషయంలో మాత్రం సీఎం జగన్ వెనకడుగు వేసినట్టే కనిపిస్తుంది. మండలి ఉండాలి అనుకుంటున్నట్టే తెలుస్తుంది. “మండలి అవసరం లేదని భావించిన జగన్ పది నెలల కిందట దాన్ని రద్దు చేసినట్టు శాసనసభలో ఓ తీర్మానం చేసి.., పార్లమెంటుకి పంపించారు. కానీ…!!
కల్యాణ చక్రవర్తికి ఎమ్మెల్సీ హామీ..!!
తిరుపతి ఎంపీ సీటుకి జరగనున్న ఉప ఎన్నికకు దివంగత ఎంపీ దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులకు కాకుండా గురుమూర్తి అనే వైద్యుడిని ఎంపిక చేసారు. దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులు ఆసక్తి చూపించలేదనో.., లేదా జగనే గురుమూర్తి ఇవ్వాలని భావించొ.. మొత్తానికి కొత్త మొఖం మాత్రం వచ్చింది. ఈ నేపథ్యంలోనే దుర్గాప్రసాద్ కుమారుడు కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారు. మంత్రి బొత్స స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. జగన్ ఆదేశం లేకుండా చీమ కూడా మాట్లాడని వైసీపీ లాంటి పార్టీలో “జగన్ కి తెలియకుండానే కల్యాణ చక్రవర్తికి ఎమ్మెల్సీ హామీ ఇస్తారని అనుకోలేం. అది బయటకు ప్రకటిస్తారని అనుకోలేం” సో.., కల్యాణ చక్రవర్తికి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలి అంటే, మండలి ఉండాలి. మండలి ఉండాలి అంటే జగన్ వెనకడుగు వేయాలి. ఈ వ్యవహారాలూ అన్నీ చూస్తుంటే మండలి రద్దు విషయంలో సీఎం జగన్ వెనకడుగు వేసినట్టే చెప్పుకోవచ్చు.
ఓపిక.., నేర్పు ఉంటూ.. నాడే ఇలా చేసి ఉంటె..!!
సీఎం జగన్ పరిపాలన బాధ్యతల్లో ఇదే తొలిసారి. అనేక విషయాల్లో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. 151 స్థానాలు గెలవడానికి ఎంత కష్టపడ్డారో.., కీలక అంశాల్లో తన నిర్ణయాలు అమలు చేయడానికి అంతే కష్టపడుతున్నారు. ప్రతిపక్ష చంద్రబాబుకి ఎమ్మెల్యేల బలం, బలగం లేకపోయినా ఆయనకు ఉన్న “మేనేజ్మెంట్ స్కిల్స్.., కన్నింగ్ మైండ్” ద్వారా అధికార పార్టీని ఇబ్బంది పెట్టగలుగుతున్నారు. సో.. మండలిలో బలంగా ఉన్న టీడీపీని దెబ్బకొట్టాలి అంటే.., తనకు బిల్లుల ఆటంకం తొలగాలి అంటే… మండలి రద్దు చేయడం మంచి మార్గమని భావించిన సీఎం జగన్ ఈ ఏడాది జనవరి 27 న మంత్రివర్గంలో ఆమోదించి.., ఫిబ్రవరిలో ఆ బిల్లుని శాసనసభలో ఆమోదించి, పార్లమెంటుకి పంపించారు. ఈ సందర్భంగా జగన్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేసారు. మండలి రద్దు కారణాలు వివరించారు.
“ఏడాదికి రూ. 60 కోట్లు ఖర్చు అవుతుందని.., మేథావులు ఉండాల్సిన వేదిక.., రాజకీయాలకు వేదికగా మారిందన్నారు. కానీ జగన్ కాస్త లోతుగా ఆలోచించి.., కొన్ని నెలలు ఓపిక పట్టి తాను అనుకున్న బలం పెంచుకోవాల్సింది. రూ. 600 కోట్లు ఖర్చయినా పర్వాలేదు. ఇన్ని ఖర్చుల్లో అదో పెద్ద ఖర్చు కాదు, దుబారా కాదు. మండలిలో జగన్ అనుకున్న మేథావులను తెచ్చి పెట్టాల్సింది. మండలి అనేది కీలక వేదిక. బిల్లులు, చట్టాలను రూపొందించడానికి, సలహాలు అందించడానికి అత్యున్నత స్థాయి వర్గాలు అక్కడ ఉండేందుకు జగన్ తరహా చర్యలు చేపట్టాల్సింది. అలా కాకుండా “రాజధాని బిల్లుల కోసం అడ్డు తగులుతున్న మండలిని రద్దు చేసేద్దాం” అనే ఆవేశపూరిత జగన్ ఆలోచన వచ్చింది. తీరా బిల్లు పైకి వెళ్ళాక.., అక్కడ ఉన్నదీ బీజేపీ కదా..! మండలి రద్దు చేస్తే “మాకేంటి లాభం..!? అనేది ఆలోచిస్తూ సమాధానం దొరక్క ఆ బిల్లుని ఆపేసింది. ఈ లోగా..!
బలం తెచ్చుకోవడం సులువే..!!
మొత్తానికి శాసనమండలిలో టీడీపీని దెబ్బ కొట్టే మార్గం నాడు జగన్ ఆలోచించలేదు. ఓపిక పట్టలేదు. వెంటనే రద్దు చేసెయ్యాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన మారింది. టీడీపీ ఎమ్మెల్సీల సంఖ్య తగ్గి, వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్య పెరిగే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. టీడీపీకి చెందిన సంధ్యారాణి, షరీఫ్, తిప్పేస్వామి, వివివి చౌదరి సహా 14 మందికి 2021 జూన్ లోగా పదవీ కాలం ముగియనుంది. వీటిలో ఎక్కువగా ఎమ్మెల్యేల కోటా, స్థానిక సంస్థల కోటా ఉండడంతో ఇవన్నీ వైసీపీ ఖాతాలో వేసుకోవడం జగన్ పెద్ద పనేం కాదు. సో.. ఇంకా ఒక్క ఏడు నెలలు ఓపిక పడితే మండలిలో వైసీపీ బలం టీడీపీకి మించుతుంది. తద్వారా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అందుకే మండలి రద్దు విషయంలో జగన్ వెనకడుగు వేసినట్టు చెప్పుకోవచ్చు. పైగా తన పార్టీలో అనేక మందికి పదవులు ఇవ్వాలి. ఎమ్మెల్సీ చేస్తానంటూ అనేక మందికి హామీలిచ్చారు. వీటిని నెరవేర్చాలి. ఈ మధ్యనే పండుల రవీంద్రబాబుకి, జకీయ ఖానుమ్ కి, డొక్కా మాణిక్య వరప్రసాద్ కి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు కల్యాణ చక్రవర్తికి హామీ ఇచ్చారు. ఇవన్నీ చూసుకుంటే మండలి రద్దు అనేది ఇక ముగిసిన కథ.