దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మందిని తమ గమ్య స్థానాలకి చేరుస్తూ నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండే వ్యవస్థ మన భారతీయ రైల్వే వ్యవస్థ. ఎప్పుడు రద్దీగా ఉండే రైళ్లు, పండగల సీజన్లో మరింత జనాభా తో కిక్కిరిసిపోతాయి. పండగల సమయంలో రైళ్లు లో ఎక్కడం అనేది ఒక మినీ యుద్ధం అయితే దానిలో సీట్ దొరికి కూర్చోవడం అనేది నిజంగా లక్ అనే చెప్పాలి. అందుకనే చాలామంది ప్రయాణికులు 3 నెలల ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటారు. దీనితో ఆకస్మిక ప్రయాణం చేయాలి అనుకునే వాళ్లు చాలా ఇబందులు పడుతూ ఉంటారు. 3 నెలల ముందే టికెట్స్ అన్ని బుక్ అయిపోవడం తో, రైళ్లు ఫుల్, టికెట్లు నిల్ అన్నట్టు సాగుతోంది ఈ తంతు అంతా. అయితే వీటి అన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ రైల్వే సంస్థ కొన్ని మార్పులు చేసింది. లాస్ట్ మినిట్ లో కూడా ట్రైన్ టికెట్ ను రిజర్వు చేసుకొని ట్రైన్ ఎక్కే ఛాన్స్ ఇస్తుంది రైల్వే సంస్థ. ఆకస్మిక ప్రయాణాలు చేయాలి అనుకునే వారికీ ఇది ఒక్క శుభవార్త అనే చెప్పాలి.
ఇక 5 నిమిషాల్లో రైలు బయలుదేరుతుందనగా మీకు టికెట్ దొరకచ్చు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐ ఆర్ సీ టీ సీ) తెచ్చిన కొత్త నియమాల ప్రకారం ఇక మీదట రైళ్లకు సెకెండ్ రిజర్వేషన్ చార్టును రిలీజ్ చేస్తారు. దీంతో రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును రైల్వే శాఖ అమల్లోకి తెచ్చిందన్నమాట. అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా ఇంటర్నెట్ వినియోగదారులు, లేదా కౌంటర్లో టికెట్లు తీసుకునే వారికి ఈ సదుపాయం వర్తిస్తుంది. దీంతో ఇప్పటివరకు ఒకసారే చార్ట్ సిద్ధం చేసే రైల్వేలు ఇక రెండుసార్లు చార్ట్ సిద్ధం చేయాల్సి వస్తుంది. రైలు బయలుదేరే ముందు టీటీఈలకు ఈ చార్ట్ అందజేస్తారు.
ట్రైన్ బయల్దేరే 4 గంటల ముందు మొదటి చార్ట్ ను ప్రిపేర్ చేస్తుంది రైల్వే సంస్థ. ఈ చార్ట్ లో రైల్లో ఎన్ని ఖాళీ సీట్లున్నాయో తెలుస్తుంది. అప్పుడు ప్రయాణికులు ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం కౌంటర్ లేదా ఆన్ లైన్ ద్వారా మిగిలిపోయిన సీట్లను హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. మళ్ళీట్రైన్ బయల్దేరే అరగంట ముందు రెండొవ చార్ట్ ప్రిపేర్ అవుతుంది, దీనిలో ఇంకా సీట్లు ఖాళీ ఉంటె లాస్ట్ మినిట్ లో కూడా టికెట్ ను బుక్ చేసుకొని సౌలభ్యం కల్పించింది రైల్వే సంస్థ. ఇందుకు అనుగుణంగా సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టం సాఫ్ట్ వేర్ లో అవసరమైన మార్పులన్నీ చేసినట్టు రైల్వే మంత్రిత్వ శాఖవెల్లడించింది. ఐఆర్ సీటీసీ ఈ-టికెట్ బుకింగ్ విధానంలో మాత్రం ఎటువంటి మార్పులు లేనట్టు రైల్వే శాఖ స్పష్టంచేసింది.
నిజానికి కరోనా రాకముందు కూడా ఈ సౌలభ్యం ఉండగా కరోనా కారణంగా రైలు సర్వీసులను నిలుపు చేశారు. ఆ తరువాత అన్నీ ప్రత్యేక రైళ్లనే నడిపారు కనుక ఈ విధానాన్ని రద్దు చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ తాజా నిర్ణయంతో ప్రయాణీకులకు కొంత ఊరట లభించనుంది. అయితే లాస్ట్ మినిట్ లో టికెట్ బుక్ చేసుకున్నప్పటికి, కరోనా కారణంగా విధించిన నిబంధన లో భాగం అయినా, ప్రయాణం చేసే ట్రైన్ సమయం కంటే 2 గంటల ముందే రైల్వే స్టేషన్ కు యథావిధిగా చేరుకోవాలన్న విషయంలో ఎటువంటి మార్పు లేదు అన్ని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
ఐ ఆర్ సి టి సి లో టికెట్ బుక్ చేయడం ఎలా:
ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుండి ఐ ఆర్ సి టి సి యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత ఐ ఆర్ సీ టీ సీ అకౌంట్ ను క్రియేట్ చేసి లాగిన్ అవ్వవల్సి ఉంటుంది. మీరు వెళ్లాలనుకుంటున్న ఊరు, ప్రయాణం తేదీ, ఏ క్లాస్ లో ప్రయాణించాలనుకుంటే ఆ క్లాస్ ఆప్షన్స్ ను ఎంచుకుని ఫైండ్ ట్రైన్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఈ లిస్టులో మీకు నచ్చిన రైలును ఎంచుకుని, చెక్ అవైలబిలిటీ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి, ఆ తరువాత టికెట్ ధరను క్లిక్ చేయాలి. ఇప్పుడు బుక్ నౌ ఆప్షన్ క్లిక్ చేసి, ప్రయాణికుల పేరు, వయసు, లింగం, కావాల్సిన బర్త్ వంటి వివరాలన్నీ నమోదు చేయాలి. క్యాప్చా కోడ్ ను, ఫోన్ నంబరు ఎంటర్ చేసి, బుకింగ్ ఆప్షన్ పై కంటిన్యూ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది. టికెట్ ధర చెల్లించగానే మీ ఈ టికెట్ బుక్ అయినట్టు ఎస్ ఎంఎస్, మెయిల్ ద్వారా, కన్ఫర్మేషన్ వస్తుంది. దీనితో మీ పేరు మీద సీట్ రిజర్వు అయిపోతుంది.