బీజేపీకి రాజకీయం చేయాలంటే సరైన శత్రువులు ఉండాలి..! సరైన మిత్రులు కూడా ఉండాలి..! శత్రువులపై బురద వేయడానికి, మిత్రులను అవసరానికి వాడుకోవడానికి బీజేపీ శత్రు/ మిత్ర బంధాలను కొనసాగిస్తుంటుంది..!! ఈ క్రమంలోనే ఏపీలో బీజేపీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. పవన్ తో బీజేపీ దోస్తీ కొనసాగుతున్న తీరు కూడా చెప్పుకోవాల్సిందే..!!
ఎక్కడ.., ఎప్పుడు… ఎలా పొత్తు ధర్మం పాటిస్తున్నారు..!?
బీజేపీ ఏపీలో ఎదగడానికి అవకాశాలను వెతుక్కుంటుంది. ఆ పార్టీకి సొంత బలం, బలగం లేదు. కేంద్రంలో అధికారం.., బీజేపీ అనే బ్రాండ్ మాత్రమే ఏపీలో బీజేపీ అంటే కొద్దో గొప్పో ఉనికి లభిస్తుంది. దేశం మొత్తం మీద బీజేపీకి కార్యకర్తలు బలం లేని ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమే. అందుకే ఏపీలో బీజేపీ క్షేత్ర బలగం కోసం జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఓట్లు వేయించుకున్నా.., లేకపోయినా జనాల్ని పోగేయడంలో మాత్రం జనసేనానికి తిరుగులేదు. అందుకే రాష్ట్రంలో బీజేపీ అవసరార్ధం పవన్ కళ్యాణ్ ని ఢిల్లీ పిలిపించి మరీ పొత్తు పొడిపించారు. కానీ.. పొత్తు ధర్మాలు ఏనాడు పాటించిన దాఖలాలు లేవు. రెండు పార్టీలు కలిసి చేసిన పెద్ద ధర్నాలు, ఆందోళనలు లేవు. కీలక అంశాల్లో రెండు పార్టీలు కలిసి ఏకాభిప్రాయం చెప్పిన దాఖలాలు లేవు.
* అమరావతి రాజధాని విషయంలో బీజేపీ పిల్లి మొగ్గలు, కుప్పి గంతులు వేస్తుంటే.., పవన్ కళ్యాణ్ మాత్రం కాస్త కన్ఫ్యూజన్ అయినప్పటికీ.. చివరికి సింగిల్ రాజధాని స్టాండ్ తీసుకున్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమీషనర్ నిర్వహించిన సమావేశానికి రెండు పార్టీలు కలిసి తమ అభిప్రాయాన్ని చెప్తే పొత్తు ధర్మంగా ఉండేది. కానీ ఈ సమావేశానికి వెళ్లే ముందు కూడా రెండు పార్టీలు కలిసి చర్చించుకోలేదు. అందుకే ఆ సమావేశంలో ఎవరి అజెండా వారు చెప్పుకున్నారు.
* హిందూ దేవాలయాల విగ్రహాల ధ్వంసంలో బీజేపీ దూకుడుగా వెళ్తుంది. రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలోనూ ఆందోళనలు చేస్తుంది. కార్యకర్తల బలం ఎలాగూ లేదు కాబట్టి.. ఉన్న కొద్దిపాటి నాయకులతో కాసేపు ప్రధాన రహదారిపై కూర్చుని, ఉనికి (మీడియాలో ఫోటో, వీడియో) వచ్చిందని నిర్ధారించుకున్న తర్వాత లేచి, వెళ్లిపోతున్నారు. అలా కానిచ్చేశారు. ఈ ధర్నా, ఆందోళనల్లో జిల్లాల్లో ఎక్కడా జనసేన పాల్గొనలేదు.
తిరుపతి అభ్యర్థి విషయంలో ఎవరికీ వారే..!!
ఇక తిరుపతి ఎంపీ స్థానానికి ఉపఎన్నిక విషయంలో బీజేపీ – జనసేన ఇప్పటికీ గందరగోళంలో ఉన్నాయి. బీజేపీ రాజకీయంగా ఎదగాలి అనుకుంటున్నా తరుణంలో కమలం గుర్తు నుండి పోటీ చేయాలి.. హిందూ సెంటిమెంట్ పండించాలి.. తిరుపతిలో లక్షకు పైగా ఓట్లు సాధించి… మొదటిసారిగా ఏపీలో కమలం వికసిస్తుందని చెప్పుకోవాలి అనే గంపెడు ఆశతో బీజేపీ ఉంది. కానీ… జనసేన ఆలోచన మరోలా ఉంది. ప్రజారాజ్యం తరపున చిరంజీవి గెలిచారు. కాపు సామాజికవర్గం ఓట్లు బాగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కి అభిమాన గణం ఈ ప్రాంతంలో ఎక్కువే.. అందుకే జనసేన పోటీ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఉన్నారు. ఈ పోటీ విషయంలో ఎవరి ఆలోచన వారిది, ఎవరి అజెండా వారిది.. ఎవరి మీటింగులు వారివి.. ఎవరి చర్చలు వారివిగా ఉన్నాయి. సో.., తిరుపతి ఉప ఎన్నిక ఈ రెండు పార్టీల మధ్య దూరం పెంచనుంది అనడంలో సందేహం లేదు.
పవన్ కి ప్రాధాన్యత ఉన్నట్టా..? లేనట్టా..!?
పవన్ కళ్యాణ్ బాగా మాట్లాడతారు. సబ్జెక్టు ఉంది. జనంలోకి వెళ్తే లక్షల్లో జనాలు వస్తారు. ఇన్ని ఉన్న పవన్ కళ్యాణ్ ని బీజేపీ పెద్దగా వాడుకోవట్లేదు అనేది మాత్రం నిజం. అసలు బీజేపీ లెక్కల్లో ఏపీలో జనసేన అనే పార్టీ ఉందొ.., లేదో కూడా అనుమానమే. అందుకే కీలక అంశాల్లో కూడా పవన్ కి సమాచారం లేకుండా బీజేపీ నిర్ణయాలు ఉంటున్నాయి. సో.. బీజేపీ అంతర్గత వ్యవహారాల్లో కాకపోయినా… ఏపీ వరకు బీజేపీ విషయంలో పవన్ కళ్యాణ్ కి సరైన ప్రాధాన్యత ఉందొ, లేదో జనసేన వారికి కూడా అనుమానమే. అన్నిటికి మించి బీజేపీ తరహా మైండ్ గేమ్ ప్రకారం చెప్పుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ ని వదలరు.., అలా అని పట్టుకోరు. జాగ్రత్తగా అవసరార్ధం చూసుకుంటారు.. అదే బీజేపీ..!! అన్నిటికి మించిన ట్విష్టు ఏమిటంటే.., ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏ నుండి పార్టీలన్నీ వెళ్లిపోతున్నా క్రమంలో అత్యవసర పరిస్థితుల్లో వైసీపీ – బీజేపీ బంధం బలపడాలి.., ఎన్డీఏ లో వైసీపీ చేరాలి అంటే పవన్ కళ్యాణ్ కూరలో కరివేపాకుగా మారినట్టే. ఒకవేళ అదే జరిగితే అప్పుడు కూడా “ఇన్నాళ్లు తమతో నడిచిన పవన్ అభిప్రాయాన్ని బీజేపీ తీసుకుంటుంది” అని అనుకోవడం ఊహ మాత్రమే అవుతుంది..!!