TDP : ఇంట్లో శవం లేస్తే భోజనాలు ఎప్పుడు పెట్టాలి అని కుటుంబ సభ్యులు శవం ముందే కొట్టుకున్నారు అంట… అలా ఉంది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి. నానాటికీ రాష్ట్రంలో అన్ని చోట్ల బలహీనం అవుతున్న తెలుగుదేశం TDP పార్టీని బతికించుకోవడం చేసింది పోయి పార్టీలోని నేతలే ఒకరినొకరు దూషించుకోవడం విమర్శించుకోవడం చూస్తే టిడిపి కాస్త ప్రయాణాన్ని ఆ పార్టీ నాయకులు తీసేలా కనిపిస్తున్నారు.
తాజాగా విజయవాడ టీడీపీ రాజకీయాల్లో రకరకాల గ్రూపు కొట్లాటలు కనిపిస్తున్నాయి. టిడిపి ఎంపీగా గెలిచిన కేసినేని నాని, విజయవాడలోని ఇతర నేతలు మధ్య ప్రస్తుత వివాదం చినికి చినికి గాలివానగా మారి పార్టీ పరువు తీసేలా కనిపిస్తోంది.
TDP ఎంపీ తో ఎవరికీ పడదు!
ప్రజారాజ్యం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి 2014లో విజయవాడ లోక్సభ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన కేసినేని నాని నీకు విజయవాడలోని సొంత పార్టీ నేతలకు మొదటి నుంచి పడదు. కేశినేని నాని చేసే కార్యక్రమాలకు మిగిలిన నాయకులు రారు. వారు చేసే కార్యక్రమాలకు కేశినేని నాని వెళ్లరు. అదేంటోగాని కేశినేని నాని విషయం వచ్చేసరికి శత్రువులు సైతం మిత్రుల అయిపోతారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో నాగుల్ మీరా కు బుద్ధా వెంకన్న కు అసలు పడదు. పశ్చిమ నియోజకవర్గం నుంచే నగర టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఎమ్మెల్సీ కూడా అయిన బుద్ధ వెంకన్న తీరు మీద మొదటి నుంచి కీలక నాయకుడిగా ఉన్న నాగుల్ మీరా గుర్రుగా ఉంటారు.
అయితే కేసినేని నాని వివాదం వచ్చేసరికి నాగుల్ మీరా బుద్ధ వెంకన్న లు ఒకటై పోతారు. ఇక సెంట్రల్ నియోజకవర్గంలో బొండా ఉమా అంతా తానే అయినట్లు వ్యవహరిస్తారు. మరో నాయకుడు తన నియోజకవర్గంలో రాకూడదు అన్నట్లుగానే మాట్లాడతారు. ఎంపీగా గెలిచిన కేసినేని నాని సైతం మధ్య నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా ఎలా పర్యటిస్తారు అని బహిరంగంగానే ప్రశ్నిస్తారు. దీంతో ఆయనకు ఎంపీల మధ్య విభేదాలు ప్రతిసారి కనిపిస్తాయి. ఇక మైలవరం నియోజకవర్గం వచ్చేసరికి దేవినేని ఉమా అసలు ఎంపీ నానిను కనీసం పట్టించుకోరు. టీడీపీ అంటేనే తాను అన్నట్లుగా వ్యవహరించే దేవినేని ఉమా వ్యవహార శైలి మీద ఎంపీ కేశినేని నాని బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తారు. దేవినేని ఉమా మిగిలిన వారిని సైతం ఎంపీ కు వ్యతిరేకంగా కూడగట్టడం తో కేశినేని నాని ఒంటరిగా మిగిలిపోయారు.
నాని కీ అడుగడుగున అడ్డంకులే
2014లో ఎంపీగా కీలక సమయంలో గెలిచిన కేశినేని నాని 2019లో దానిని నిలబెట్టుకోవడంలో కీలకం అయ్యారు. ముఖ్యంగా 2019లో ఆయనకు ఎలాంటి మద్దతు పార్టీ నుంచి గానీ నాయకుల నుంచి గానీ లేక పోయినప్పటికీ మొత్తం ఏడు నియోజకవర్గాల్లో తానే స్వయంగా తిరిగి, కుటుంబ సభ్యులను తిప్పి ప్రచారం నిర్వహించుకోవడం విశేషం. ఆయనకు శాసనసభ అభ్యర్థులుగా నిలబడిన పార్టీ నాయకులు నుంచి సహకారం అంతంత మాత్రంగానే అందింది. ఇక పార్టీ వ్యవహారాలు చూసుకునే చంద్రబాబు దీని మీద దృష్టి సారించిన సందర్భం లేదు. దీంతో 2019 లో కేశినేని నాని స్వయంగా తన అనుచరుల, శ్రేయోభిలాషుల సహకారంతోనే పోటీలో నుంచుని, కేవలం ఎనిమిది వేల ఓట్ల తేడాతో గట్టెక్కారు.
** నియోజకవర్గంలో జరిగే పనులను ఎప్పటికప్పుడు కేశినేని నాని పర్యవేక్షించేవారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ విషయంలో నాని ఎన్నోసార్లు కేంద్రమంత్రులను బిజెపి నాయకులను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. ఒక్కడిగా దాని కోసం పోరాడిన సందర్భాలు ఉన్నాయి. విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో టాటా ట్రస్ట్ ద్వారా ఎన్నో పనులను చూపించడంతో పాటు స్వయంగా టాటా గ్రూపు ఛైర్మన్ రతన్ టాటా తో పలుమార్లు భేటీ అయ్యి, ఎన్నో ఉపయోగపడే కార్యక్రమాలను నియోజకవర్గ ప్రజలకు అందించారు. ఇవన్నీ కేసినేని నాని స్వయంగా చేసుకున్నవే తప్పా ఎక్కడ పార్టీ సహకారం గానీ ఇతర నాయకుల హెల్ప్ కానీ ఆయనకు లేదు.
తాజా వివాదంలో నాని నిర్వేదం
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పొరేటర్ సీట్లను కేటాయించే విషయంలో, మేయర్ అభ్యర్థి గా ఎంపీ కేశినేని నాని కుమార్తె ఎంపిక విషయంలోనూ ప్రస్తుతం టీడీపీ లో అంతర్గత వివాదం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేయబోయే వారిని ఇష్టానుసారం ఎంపిక చేశారని, కనీస బలము కూడా లేని వారిని పోటీలో నిలిపారన్నది కేసినేని నాని ఆరోపణ. తన కూతురు శ్వేత ను టిడీపి మేయర్ అభ్యర్ధిగా ప్రకటించడం వల్లనే, కావాలని దెబ్బ తీసేందుకు కొందరు నేతలు ఈ కుట్రపన్నారు అంటూ, కొద్ది రోజుల క్రితం కొన్ని డివిజన్లలో టీడీపీ అభ్యర్థులను కేశినేని నాని మార్చారు. దీంతో మిగిలిన నేతలు నాని ఇష్టానుసారం అన్ని విషయాల్లో వేలు పెట్టడం సరికాదంటూ, గతంలో కార్పోరేటర్ అభ్యర్థులుగా టిక్కెట్లు ఇచ్చిన వారికి మళ్లీ ఎలా మారుస్తారు అంటూ వివాదం లేవదీశారు. ఈ విషయంలో ప్రస్తుతం బెజవాడ టీడీపీ రాజకీయం హాట్ హాట్ గా ఉంది.