టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన విషయం ‘మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్’ వార్త. కరోనా జాగ్రత్తలపై చిరంజీవి ఎన్నో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎవేర్ నెస్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. కానీ.. సరిగ్గా తన 152వ సినిమా ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభించే సమయంలో ఆయనకు పాజిటివ్ వచ్చింది. ఇదే రీతిలో బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ కూడా ఎన్నో జాగ్రత్తలు చెప్పారు.. కానీ.. కుటుంబం మొత్తం వైరస్ బారిన పడ్డారు.. కోలుకున్నారు. ఇప్పుడు అనుకోకుండా చిరంజీవికి కూడా పాజిటివ్ వచ్చింది. ఈ విషయం అభిమానులను కలచి వేస్తోంది. అయితే..
ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఈరోజు హైదరాబాద్ లో ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. షెడ్యూల్ మిస్ కాకూడదని షూటింగ్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. చిరంజీవి లేకుండానే షూటింగ్ జరుపుతున్నారు. ఆయన లేని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకులు కొరటాల శివ. లాక్ డౌన్ కు ముందు నాటికే 40 శాతం షూటింగ్ పూర్తైంది. కరోనా పరిస్థితులు లేకపోతే ఈ దసరాకే సినిమా విడుదలైపోయేది. చిరంజీవికి కరోనా సోకిన ప్రస్తుత పరిస్థితిల్లో ఆచార్య షూటింగ్ మళ్లీ వాయిదా పడుతుందని అందరూ భావించారు. కానీ.. షూటింగ్ జరగడం ఇండస్ట్రీ వర్గాలను, ఫ్యాన్స్ కు సంతోషం కలిగిస్తోంది.
మరోవైపు చిరంజీవి స్వయంగా తనకు కరోనా పాజిటివ్ అని ప్రకటించారు. ఎటువంటి లక్షణాలు లేవని కూడా చెప్పారు. ఇదే అభిమానులు అందరినీ కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసింది. దీంతో చిరంజీవి మరో వారంలోనే కోలుకుంటారని.. మళ్లీ అదే ఉత్సాహంతో షూటింగ్ లో పాల్గొనడం ఖాయమంటూ మెసేజెస్ చేస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం మంచి ఫిట్ నెస్ తో ఉన్నారు. కరోనా నేపథ్యంలో హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. త్వరలోనే ఆయన కోలుకుని షూటింగ్ లో పాల్గొంటారని అంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ నటిస్తోంది. మరో ముఖ్యపాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడని తెలుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!