కలియుగంలో శ్రీఘ్రంగా అనుగ్రహించే దేవతా స్వరూపాలు వినాయకుడు, ఆంజనేయస్వామి, చండి. వీరిలో గణేషుడు, హనుమాన్కు చాలా విషయాలలో పోలికలు ఉంటాయి. ఇద్దరు సింధూర ప్రియులు.
ఇద్దరు స్వామి భక్తులు. ఒకరు తల్లిదండ్రులకు మరొకరు సీతారాములకు అంటే తల్లిదండ్రులకు దాసుడు. సప్త చిరంజీవులలో ఒకరు హనుమంతుడు. బలవంతుడు, శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ కలిగిన దేవుడు హనుమంతుడు. అందుకే హనుమాన్ గురించి ఆలోచించగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన బలం. ఇక ఏకదంతుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమస్త గణాలకు అధిపతి. సకల కార్యాలకు అధిపతి. వీరిద్దరి కలిసిన స్వరూపాన్ని పురాణాలలో అచ్యుతప్రభుగా ఆరాధిస్తారు. ఈ రూపంలో ఉన్న దేవాలయ విశేషాలు తెలుసుకుందాం…
చెన్నై నగరం అడయార్ ప్రాంతంలో మధ్యకైలాస్లో ఉన్న ఆనంద వినాయకుని ఆలయంలో ఈ విగ్రహం ఉంది. ఈ విగ్రంలో సగం వినాయకుడు, సగం హనుమంతుడు కొలువై ఉన్నారు. ఆదిలో వినాయకుడిని, ముగింపులో హనుమంతుడిని పూజిస్తారు.
ఆద్యంతాలకు ప్రతీక అయిన ఈ స్వామిని `ఆద్యంత ప్రభు` అంటారు. హనుమంతుడు, వినాయకుడు వేర్వేరైనా, తత్త్వం ఒక్కటే. ఇక బ్రహ్మచారులైన విఘ్నేశ్వరుడు, ఆంజనేయస్వామివార్లు వారి అర్ధ శరీరాలతో ఏకమైనట్లు ఏర్పాటైన విగ్రహం భక్తులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఇద్దరు సింధూర ప్రియలు. ఒకవైపు ఆంజనేయస్వామి, మరోవైపు వినాయకుడు. ఈ దేవాలయం సందర్శిస్తే సకల శుభాలు కలుగుతాయి. శాస్త్ర విధానంలో నిర్మించిన ఈ దేవాలయం పరమ విశేషమైనది. ఈ అద్యంత ప్రభును పూజిస్తే సకల శనిదోషాలు పోతాయని గణేష పురాణంలో ఉంది.
కాగా, ఇక్కడి దేవాలయంలో అన్నదానం, పితృకర్మలు కూడా చేస్తుంటారు. అంతే కాకుండా ఇక్కడ హనుమంతుడు పార్వతీ పరమేశ్వరులు, ఆదిత్యుడు, మహావిష్ణువు, దుర్గా, నవగ్రహాలు, స్వర్ణభైరవుని విగ్రహాలు కూడా ఉన్నాయి. అవకాశం ఉన్నపుడు వెళ్లి విశేషమైన ప్రత్యేకమైన ఈ రూపాన్ని సందర్శించి ఆద్యంత ప్రభు అనుగ్రహానికి పాత్రులు కండి.