హిందూ ధర్మంలో అనేక ప్రత్యేకతలు ఉంటాయి. పూజా విధానాలలో అనేకానేక విశేషాలు. ఇలాంటి వాటిలో ప్రత్యేకమైనది శంఖం పూజ. అనేక రకాల శంఖాలు ఉన్నాయి. వాటిలో దక్షిణావృత శంఖం చేత పూజ చేస్తే ఏం ఫలితమో తెలుసుకుందాం…
శ్రీ మహాలక్ష్మికి తోబుట్టువు శంఖం. శ్రీమహావిష్ణువుకు ప్రియమైనది. సాధారణంగా శంఖాలు ‘వామావర్తి’లో ఉంటాయి. అంటే- ఎడమ వైపుకు తిరిగి ఉండడం. కొన్ని శంఖాలను పూరించడానికి ఉపయోగిస్తారు. మరికొన్ని కేవలం ప్రదర్శనకు మాత్రమే.
ఏ శంఖాలతో పూజించాలి
శంఖం ఆకారం వైవిధ్యభరితం. ఇది సముద్ర ప్రాణి నత్త జాతికి చెందినది. గోధుమ గింజ పరిమాణం నుండి ఐదు కిలోల బరువు గల శంఖాలు లభిస్తాయి. వీటితో చిత్ర విచిత్రమైన బొమ్మలు, ఆభరణాలూ తయారుచేస్తారు. శంఖంతో రూపొందిన గాజులు, హారాలను పవిత్రంగా భావిస్తారు. దెబ్బతినని శంఖమే పూజనీయమైనది. శంఖం ఉన్న నివాస గృహంలో సాత్వికత, పవిత్రత, శుద్ధి ఏర్పడతాయి. భద్రత లభిస్తుంది.
లక్ష్మీ శంఖం
శంఖాల్లో రకాలు అనేకం. వాటిలో ‘దక్షిణావర్తి శంఖం’ లభించడం అరుదు. ఇది కుడి వైపుకు తిరిగి ఉంటుంది. ఈ కారణంగానే ‘దక్షిణావర్తి’ అంటారు. ఈ తరహా శంఖం లక్ష్మీదేవికి సంబంధించిందని తంత్ర శాస్త్ర నిర్ధారణ. దక్షిణావర్తి శంఖం ఉన్న చోటు లక్ష్మీదేవి నివాస స్థానమని మన సంపరదాయంలో ప్రగాఢ విశ్వాసం.
శంఖ పరిమాణం
ఎక్కడా పగుళ్లు లేని దక్షిణావర్తి శంఖం ఉత్తమమైనది. దోష రహితమై ఉండాలి. ఇది ధన సమృద్ధి ప్రదాయిని. దీని బరువు కనీసం ఐదు తులాలు ఉండాలని కొందరంటారు. కాని ఇది తప్పనిసరి నియమం కాదు. అంతకంటే తక్కువ బరువు గల శంఖాలు కూడా అద్భుత ప్రభావం చూపుతాయి.
పాప నివారణ
శంఖంలో ఆవుపాలు నింపి గృహం లేదా ఆలయంలో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తే సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. మామూలుగా కూడా శంఖంలో శుద్ధ జలం నింపి, లక్ష్మీ ప్రతిమకు అభిషేకిస్తే శుభకరం. దక్షిణావర్తి శంఖంలో నీరు నింపి, ఎవరిపైనైనా సంప్రోక్షిస్తే వారి పాపాలు తొలగిపోతాయి.