(న్యూస్ ఆర్బిట్ స్పెషల్ బ్యూరో )
జగన్ ఎవరిని వదలడు… అన్ని మాటలు గుర్తు పెట్టుకుంటాడు…జరిగిన ప్రతి విషయంపై ప్రతి చర్యలు గ్యారంటీ.. బుర్రంతా హిట్ లిస్ట్ ఉంది… ఒక్కొక్కరుగా ఆయన టార్గెట్ ను ఛేదిస్తారు…. అయ్యా బాబు అన్నా వినే రకం… క్షమించే రకం అస్సలు కాదు…. రాయలసీమలో శత్రువుని చంపడం అంటే… అతడి ఆర్థిక మూలాలను ముందు నాశనం చేయాలి. ఆ తర్వాత మనిషిని లేకుండా చేయాలి అనేది ఫ్యాక్షన్ సిద్ధాంతం… దీనికి దగ్గరగానే జగన్ చర్యలు కనిపిస్తున్నాయని తల పండిన రాయలసీమ రాజకీయ నేతలు చెబుతున్నారు. ఆయన బుర్రలో మొదటి టార్గెట్ అనంతపురం జేసి బ్రదర్స్.
తాత దగ్గర నుంచి..
జేసీ సోదరులకు, వైయస్ కుటుంబానికి ఉన్న వైరం ఇప్పటిది కాదు. వైయస్ రాజారెడ్డి ఉన్నప్పుడే జెసి బ్రదర్స్ ఆయనతో కయ్యానికి కాలు దువ్వారు. తాడిపత్రి, పులివెందుల వేర్వేరు జిల్లాలైన అతి దగ్గర ఉండే ప్రాంతాలే. దీంతోనే వైయస్ కుటుంబానికి జేసీ సోదరులకు ఆధిపత్య పోరు ఫ్యాక్షన్ రాసుకున్నాయి. ప్రాంతాల మీద పట్టు కోసం రాజారెడ్డి తో జేసీ బ్రదర్స్ పలుమార్లు గొడవలకు దిగిన సందర్భాలున్నాయి. రాజారెడ్డి హత్య విషయంలోనూ జేసీ బ్రదర్స్ హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ విషయంలో ముందుచూపుతో వ్యవహరించారు. మరోపక్క జేసీ సోదరులకు సైతం కాంగ్రెస్ పార్టీలోని కొందరు పెద్దలు సహకారం లభించింది. అధిష్టానం వద్ద వారు ప్రాపకం పెంచుకున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ని అదుపులో వుంచాలంటే జేసీ బ్రదర్స్కు ఖచ్చితంగా ప్రోత్సాహం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీలోని పెద్దలు భావించేవారు. దీంతో జేసీ దివాకర్రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించింది. వైయస్ రాజశేఖర్రెడ్డి బహిరంగంగా ఎప్పుడూ జెసి సోదరులను ఏమీ అనేవారు కాదు. లోలోపల జెసి సోదరుల మీద ఉన్న కోపాన్ని పంచుకునే ఆయన రాజకీయం చేశారు. అయితే ఎప్పుడూ వైయస్ తీసుకునే నిర్ణయాల మీద జెసి వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తం చేసేవారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దల వద్ద ఉన్న పరిచయాలు వల్ల వైయస్ ను ఎప్పుడు ఢీకొట్టే వారు. అనంతపురం రాజకీయాల్లో జెసి కుటుంబానికి ప్రాధాన్యం ఉన్నప్పటికీ, అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా వారు పెద్దగా రాణించలేకపోయారు. కడప జిల్లాలో మొత్తం వైయస్ కుటుంబం హవా సాగేలా పరిస్థితి మారింది. దీంతో రాన్రాను వైయస్ ప్రాబల్యం పెరగడంతో పాటు రాష్ట్రం మొత్తం మాస్ ఇమేజ్ ను ఆయన సంపాదించుకున్నారు.
అనవసరంగా పెట్టుకున్నారా?
రాష్ట్రం విభజించిన తర్వాత జేసీ సోదరులు కొన్నాళ్లు కాంగ్రెస్ లో ఉన్నా, తర్వాత చంద్రబాబు సూచనలతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. జెసి సోదరుల రాక ఇటు పరిటాల కుటుంబానికి ఇష్టం లేకున్నా చంద్రబాబు సూచనలతో జేసీ సోదరులు పసుపు కండువా కప్పుకున్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ మీద పలుమార్లు అసభ్యకర రీతిలో ను మాట్లాడారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే టెంట్ వేసి మరి.. జగన్ కుటుంబ సభ్యులను సైతం అసభ్యకరంగా మాట్లాడుతూ తిట్టారు. ఆ సమయంలో కనీసం పల్లెత్తు మాట కూడా అని జగన్ ఆ విషయాలన్నీ మాత్రం మనసులోనే ఉంచుకున్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని తేలుతాయి అనే కోణంలో… తాతల కాలం నాటి పగలు ఉన్న దృష్ట్యా జగన్ ఎక్కడ కోపానికి పోకుండా నిగ్రహంతో సమయం కోసం వేచి చూశారు.
ఇదే సమయమా?
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జెసి దివాకర్ రెడ్డి మొదట్లో జగన్ను కొన్నిసార్లు అభినందన పూర్వకంగా మాట్లాడుతూ మా వాడే అనే కోణంలో కాస్త దగ్గరవడానికి ప్రయత్నించారు. పలుమార్లు జగన్ పార్టీలోకి పిలిస్తే వెళ్తాను అంటూ హింట్లు ఇచ్చారు. ఇవేవీ జగన్కు పట్టవు. ఆయన హిట్ లిస్టులో మొదటి పేరు జేసీ సోదరులే. అందుకే ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జెసి సోదరుల ఆధ్వర్యంలో నడిచే త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ కి, వారి ఆధ్వర్యంలో నడిచే వివిధ మైనింగ్ లీజులు రద్దు చేశారు. ఇక దివాకర్ ట్రావెల్స్ బస్సులు పైన కేసులు నడుస్తున్నాయి. బి ఎస్ ఫోర్ వాహనాలను bs6 వాహనాలుగా తప్పుడు పత్రాలు సృష్టించి తిప్పుతున్నారు అనే ఆరోపణల మీద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉన్న జేసీ సోదరులపై జగన్ మరో అస్త్రం ప్రయోగించారు. ఇది వారు తట్టుకోలేనంత పెద్ద అస్త్రం. అక్రమ మైనింగ్ చేశారంటూ వంద కోట్లకు పైగా జరిమానా విధిస్తూ మైనింగ్ శాఖ తాజాగా ఉత్తర్వులిచ్చింది. ఇప్పుడు ఇది తాజా రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. జగన్ తో పెట్టుకుంటే సాధారణంగా వదలరంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
దీనిపై చంద్రబాబు సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రస్తుతం జెసి సోదరులు పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లు తయారైంది. అయితే ఆర్థిక మూలాలన్నీ నాశనం చేసిన తర్వాత ఫ్యాక్షన్ రాజకీయాల్లో మనిషిని కూడా లేకుండా చేయడం ఎక్కువగా కనిపిస్తుంది. మరి జేసీ సోదరుల విషయంలో ఎం జరుగుతుందో చూడాలి.