20 లక్షల కోట్లు… ఇంత మొత్తం దేశం కరోనాను ఎదుర్కునేందుకు సహాయార్థం గా కేంద్రం ప్రకటిస్తే ప్రతి ఒక్క భారతీయుడు ముక్కున వేలు వేసుకున్నారు. ఇప్పుడు ఇదంతా మన కోసమేనా మనలను ఈ క్లిష్టతరమైన పరిస్థితి నుంచి బయటపడడానికేనా అని ఆశ్చర్యపోయారు…. ఆనందపడ్డారు. కట్ చేస్తే అంతటి బృహత్తర ప్యాకేజీని డైలీ సీరియల్ లా ప్రకటిస్తూ చాలా హంగామా చేశారు. చిన్న చిన్న విషయాలను బోలెడంత డప్పు కొట్టుకుని బిజెపి శ్రేణులు తమ మైలేజీ పెంచుకునే పనిలో పడ్డారు. చివరికి చూస్తే అవి రుణాలు గా ప్రజలకు అందుబాటులో ఉండే డబ్బు తప్పించి మన ఖాతాలోకి చిల్లిగవ్వ కూడా రాదు అన్న విషయం అర్థం అయిపోయింది.
ఇక ఈ మధ్యలో మన ఆర్థిక మంత్రి నిర్మలమ్మ పోషించిన పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఆమెలో ఒక రాజకీయ నాయకురాలికి ఉండాల్సిన లక్షణాలు కనిపించకపోగా ఒక బ్యూరోక్రాట్ పాత్రను ఇన్నిరోజులు పోషించింది. సరే చివరికి ఈ ఐదు రోజుల సీరియల్ ప్రకటనలో జనానికి కనెక్ట్ అయ్యే అంశం ఒక్కటైనా ఉందా అంటే…. అదీ లేదు. కరోనా కష్టాల్లో ఉండి ఉపాధి కోల్పోయి.. తినడానికి అన్నం దొరక్క…. భవిష్యత్తుపై ఎలాంటి భరోసా లేకుండా ఎవరో వచ్చి సాయం చేస్తారని ఎదురు చూసే జనాలకు ఐదు రోజులు బడ్జెట్ ప్రసంగం వినిపించింది. కొన్ని అంశాలను అయితే చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
ఇక ఎప్పటి నుండో కేంద్ర పాలనకు అలవాటు పడిపోయి కొద్దిగా అనుభవం ఉన్నవారు అయితే మోడీ తన ఖజానా నుంచి ప్రజలకు ఏమీ రాదు అని ముందే ఫిక్స్ అయిపోయారు. ఈరోజున పేదలే కాదు మధ్యతరగతి వారు కూడా ఎదురు చూస్తున్నది ఆర్థిక సహాయం. అయితే 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించాక చివరికి అందులో కొంత భాగం అయినా తమకు ఉపయోగకరంగా మారుతుందని విశ్వాసాన్ని కల్పించడంలో విఫలమైంది కేంద్రం.
కేంద్రం ఆదాయం తగ్గింది సరే…. రాష్ట్ర స్థితిగతులు కూడా ఘోరంగా ఉన్నాయి దానికి ఒప్పుకుందాం. కానీ ఏదో ఒక మార్గంలో ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్రానిదే కదా కెసిఆర్ వంటి ముఖ్యమంత్రులు కొన్ని సూచనలు ఇచ్చారు. భారీ కరెన్సీ ముద్రణ, హెలికాప్టర్ మనీ వంటి సాహసాలకు మోడీ ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఎఫార్బీం పరిమితి పెంపు మాత్రమే రాష్ట్రాలకు ఉన్న ఏకైక ఉపశమనం.
మోడీ అంత పెద్ద ప్యాకేజీని ప్రకటించే నాడే ముఖ్యాంశాలు చదివి వినిపించకుండా అందులో తాను చెప్పడానికి ఏమీ లేదు.. ఆ సంగతేదో నువ్వే చూసుకో.. ఆ తిట్లు ఏదో నువ్వే పడు అన్నట్లు నిర్మలాసీతారామన్ చేతికి అంతా ఇచ్చినపుడే మనం అర్థం చేసుకునే ఉండాల్సింది… ‘ఆత్మనిర్భర్ భారత్’ అంటే గుండె నిబ్బరం చేసుకొని అన్ని ఆశలు చంపుకొని కాలం వెళ్లదీయడమే అని.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!