పోలవరం.. ఏపీలో రాజకీయానికి వరం. ఓటర్లకు శాపం.. ఈ ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు వరద రాజకీయం జరుగుతుంది.. ముంపు గ్రామాల మొర తీరడం లేదు.. ఇది ఇప్పుడే కొత్త కాదు.. గత ప్రభుత్వాల హయాంలో ఎన్నో దారుణాలు జరిగాయి.. పోలవరం పేరిట చంద్రబాబు భజన కీర్తనలు, ఉత్తుత్తి ప్రచారాలు చేయించుకున్నారు తప్ప ఫలితం మిగలలేదు.. టీడీపీ చేసిన తప్పులు సరిదిద్దలేక.. కొత్తగా మరికొన్ని తప్పులతో జగన్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుతో ఆటలాడుతోంది.. ప్రాజెక్టు పనులు, టెండర్లు, అవినీతి, వాటాలు తర్వాత మాట్లాడే అంశం కానీ.. ప్రస్తుతం ముంపు పరిస్థితి ఓ సారి చూడాల్సిందే..!!
పోలవరం ముంపు బురద రాజకీయం ఒక సారి పరిశీలిద్దాం. వరద వస్తే బురద వస్తుంది. దాన్ని రాజకీయంగా వాడుకునే పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతం పోలవరం ముంపు గ్రామాల్లో వాస్తవ సమస్యలు ఏమిటి..? ప్రభుత్వం ఎక్కడ తప్పుచేస్తుంది..? ప్రభుత్వం మీద ఎందుకు వ్యతిరేకత వస్తుంది..? దానికి పరిష్కారం ఏమిటి అన్న విషయాలను పరిశీలిస్తే..
మన దేశ వ్యవస్థలోనే ఇలాగా ..!?
ఒక పెద్ద నీటి ప్రాజెక్టు కట్టాలి అనుకుంటున్నప్పుడు ముందుగా సివిల్ వర్క్ లు ప్రారంభిస్తారా ..? లేక అక్కడ ముంపు ప్రాంతాలను ఖాళీ చేయిస్తారా..? వాస్తవానికి ముంపు ప్రాంతాల వారికి పునరావాస ప్యాకేజీ ఇచ్చి ఖాళీ చేయించిన తరువాత సివిల్ వర్క్స్ ప్రారంభించాలి. కానీ పోలవరం ప్రాజెక్టు విషయంలో ముందుగా సివిల్ వర్క్ లు ప్రారంభించేశారు. సివిల్ వర్క్స్ ప్రారంభిస్తే కాంట్రాక్టర్ల ద్వారా లబ్దిపొందే అవకాశం ఉంటుంది. 2004 నుండి 2009 వరకూ ఉన్న ప్రభుత్వం సివిల్ వర్క్ లకు ప్రాధాన్యత ఇచ్చింది. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు అదే పని చేశాయి. భూసేకరణ జరిపి ముంపు ప్రాంతాలకు పునరావాసం ఇచ్చేసిన తరువాత పోలవరం ప్రాజెక్టు సివిల్ పనులు ప్రారంభిస్తే రెండు సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తి అయ్యేది. కానీ .. పునరావాసం జరగలేదు. భూసేకరణ జరగలేదు. ముంపు గ్రామాల ప్రజలను తరలించలేదు. సివిల్ వర్క్స్ ప్రారంభించేశారు. అందుకే గత 16-17 సంవత్సరాల నుండి పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రక్రియ వ్యవస్థలో ఉన్న పెద్ద లోపం. కమిషన్ల కోసం ముందుగా డ్యామ్ పనులు ప్రారంభించేస్తారు. భూసేకరణలో డబ్బులు వస్తాయి కానీ బేరాలు వెంటనే తెగవు. దీనిలో చాలా మంది ఇన్వాల్ అవుతుంటారు. అందుకే ముందుగా ఈ పనులు చేయరు.
ముంపు ముప్పు తప్పేది ఎప్పుడో..!?
పోలవరం ప్రాజెక్టుకు వరద వచ్చిన ప్రతి సారి గోదావరి పరివాహక ప్రాంతంలోని సుమారు 270 గ్రామాలు ముంపునకు గురి అవుతుంటాయి. అక్కడి ప్రజలు గ్రామాల్లో పడవలు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ పరిధిలోని ఏడు ముంపు గ్రామాలను ఏపిలో కలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే ఆ ముంపు గ్రామాలకు పునరావాస ప్యాకేజీ అందజేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే .. ఆ గ్రామాల ప్రజలు ఇప్పుడు తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. వరద వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం మంచిగా సాయం అందిస్తొంది. కానీ తమకు ఏపి ప్రభుత్వం సరిగ్గా చూసుకోవడం లేదు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు అవుతున్నా పునరావాస ప్యాకేజీని ఏపి ప్రభుత్వం ఇవ్వలేదు అని ఆ గ్రామాల ప్రజలు అంటున్నారు.
వరద వచ్చిన ప్రతి సారి ముంపు గ్రామాలు బురద మయంగా మారుతుంటాయి. దేవిపట్టణం మండలం తాళ్లూరి గ్రామంలో 120 ఎస్టీ కుటుంబాలు ఉండగా, వీళ్లు పునరావాసం కోసం రావిలంకపల్లి వెళ్లతాం అక్కడ పునరావాసం కల్పించాలని కోరారు. అధికారులు అంగీకరించారు ఒప్పందాలపై సంతకాలు కూడా చేశారు. వాళ్లకు ప్యాకేజీ ఇవ్వడానికి, అక్కడ ఇళ్లు కట్టి ఇవ్వడానికి అంతా రెడీ అయ్యింది. కానీ వాళ్లకు ఒప్పందం ప్రకారం రావిలంకపల్లి కాకుండా ఫజిల్లాబాద్ లో ఇళ్లు కట్టారు. అక్కడికి వెళ్లడానికి గ్రామస్తులు అంగీకరించడం లేదు. తాళ్లూరి గ్రామం పరిస్థితి ఇలా ఉంది. ఇలా పోలవరం ముంపు గ్రామాల పునరావాస ప్రక్రియలో జరుగుతున్న తంతు వివాదాస్పదంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలోనూ భూసేకరణ విషయంలో శ్రద్ద చూపించలేదు. గత ప్రభుత్వం మొదటి రెండేళ్లు పట్టిసీమ గురించి శ్రద్ద చూపారు. అది పూర్తి అయిన తరువాత పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టినా సివిల్ వర్క్స్ పై శ్రద్ద చూపారు కానీ పునరావాసం గురించి పట్టించుకోలేదు. భూసేకరణ పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ నిర్వహించి సివిల్ వర్క్స్ కే ప్రాధాన్యత ఇచ్చింది కానీ పునరావాసం గురించి దృష్టి పెట్టలేదు. పునరావాసం గురించి పట్టించుకున్నా అందులో తాళ్లూరి గ్రామస్తులకు ఇళ్ల నిర్మాణం లాగా రాజకీయం జరుగుతుంటుంది. అందుకే ఇది బురద రాజకీయంగా పేర్కొనాల్సి వస్తుంది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా రాజకీయం కోసం పార్టీలు దాన్ని వాడుకుంటూనే ఉంటాయి.