TDP: రాజకీయాల్లో నాయకులు రెండు రకాలు ఉంటారు. వారిలో ఒకటవ రకం పేరు, బ్రాండ్ ఇమేజ్ కోసం మీడియాలో పరుగులు పెడుతూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకుంటూ పాత కాలం నాటి రాజకీయాలు చేస్తూ ప్రత్యర్ధి పార్టీపై రోజుకు ఒక విమర్శ చేస్తూ పేపర్ స్టేట్ మెంట్ ఇచ్చే వారు. ఇక రెండవ రకం నాయకులు ఇవన్నీ చేస్తూనే ప్రజల్లోనే ఉంటారు, ప్రజలతో తిరుగుతుంటారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెళ్తుంటారు. వాళ్లల్లో ఒకడిగా ఉంటారు. గెలిచినా ఓడినా నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ఉంటారు. తమకు వేరే వ్యాపకాలు, వ్యాపారాలు లేవు, తమకు రాజకీయం అనేది వ్యాపారం కాదు, రాజకీయమే పూర్తి స్థాయి వ్యాపకంగా ఉంటారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రాష్ట్రంలోని ఒక జిల్లా తెలుగు దేశం పార్టీలో వాటికి పూర్తి విరుద్దమైన రాజకీయాలు జరుగుతున్నాయి. ప్రత్యర్ధి పార్టీలతో లాలూచీపడటం, తమ వారసులను ప్రత్యర్ధి పార్టీకి అప్పజెప్పడం ఒక్క జిల్లాలో జరుగుతోంది. చంద్రబాబుకు తెలిసినా ఆ జిల్లాలో సరిచేయలేని పరిస్థితి ఉంది. అది ఏ జిల్లాలోనే ఇప్పటికే అర్ధం అయి ఉంటుంది. అదే నెల్లూరు జిల్లా. 2019 ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలుచుకోలేదు. ఈ జిల్లాలో మొదటి నుండి టీడీపీకి పట్టులేదా..? అంటే గతంలో బాగానే ఉంది. 1999 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని ఆరు స్థానాలు టీడీపీ గెలుచుకుంది. గూడూరు, సూళ్లూరుపేట, సర్వేపల్లి, ఉదయగిరి, వెంకటగిరి, కావలి స్థానాలను టీడీపీ గెలుచుకుంది. 2004లో ఏమీ గెలవలేదు. 2009 లో మళ్లీ పుంజుకుంది. 2004 లో ఓడిపోయిన తరువాత నాయకులు ప్రజల్లో తిరగడం మొదలు పెట్టారు. 2009లో అయిదు స్థానాల్లో టీడీపీ గెలుచుకుంది. వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడురు, కోవ్వూరు, కావలి నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. 2014లో మూడు గెలుచుకుంది. కొవ్వూరు, ఉదయగిరి, వెంకటగిరి నియోజకవర్గాలు గెలుచుకుంది. 2009కి 2014కి కొంత బలం తగ్గింది. 2019కి వచ్చే సరికి పూర్తిగా సున్నా. ఒక్క నియోజకవర్గంలోనూ గెలుచుకోలేదు.
TDP: సక్సెస్పుల్గా 54కి 54 డివిజన్ లను వైసీపీ చేతిలో పెట్టారు
మొన్న జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లోనూ సక్సెస్పుల్గా 54కి 54 డివిజన్ లను వైసీపీ చేతిలో పెట్టేసింది. సరే ఈ జిల్లాలో నాయకత్వానికి కొదవ ఉందా..? అంటే అదీ లేదు. నేతలు ఉన్నారు. ఈ జిల్లాలో ఔట్ డేటెడ్ పాలిటిక్స్ ఎక్కువ. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, బీదా రవిచంద్ర, అజీజ్, రామకృష్ణ ఇలా ఒక్కో సామాజికవర్గానికి ఒక్కో బ్రాండ్ ఇమేజ్ ఉన్న నాయకులు ఉన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా చేశారు. నాలుగు సార్లు ఓడిపోయినా అంతకు ముందు గెలిచారు. అజీజ్ మంచి వక్త. బీదా రవిచంద్ర తెలుగు యువతలో కీలకమైన పదవి నిర్వహించారు. మంచి ఫ్యామిలీ పట్టు ఉంది. బలమైన నాయకులు ఉన్నప్పటికీ సీట్లు సున్నా. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో తమ వద్ద ఉన్న వాళ్లు కూడా వైసీపీ వద్ద డబ్బులు తీసుకుని కోవర్టులుగా మారిపోయారు. ఎవరెవరు కోవర్టులుగా మారి పార్టీకి నష్టం కల్గించారు అనే పూర్తి జాబితా చంద్రబాబు వద్ద ఉంది. కానీ ఆయన ఏమీ చేయలేని పరిస్థితి. సోమిరెడ్డి చంద్రమోహన్ ఉన్నారు అంటే రోజు ఆయన ఎక్కడో ఒక చూటకు వెళ్లి మీడియా సమావేశం పెట్టి వచ్చేస్తుంటారు. అంతకంటే ఆయన ఏమి చేయలేరు. నాలుగు సార్లు ఆయన సర్వేపల్లి నుండి ఓడిపోయిన తరువాత ఆయన స్వచ్చందంగా తప్పుకొని ఆయన వారసులను దింపి తెరవెనుక ఉండాలి. తనే పోటీ చేస్తా.. తనే గెలుస్తాను.. అంటే ప్రస్తుత రాజకీయాల్లో అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఆయన బలహీనతలు, ఆయన లోపాలు అందరికీ తెలిసిపోయాయి. అదే విధంగా అజీజ్, రామకృష్ణ, బీదా రవిచంద్ర లు పేరుకు పెద్ద పెద్ద నాయకులు అయిపోయారు కానీ అక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే వీళ్లు గ్రౌండ్ లెవల్ కు వెళ్లడం లేదు. కేవలం మీడియాలో ఫోకస్ కోసం కార్యక్రమాలు చేస్తున్నారు.
బలమైన కార్యకర్తలు ఉన్నా..
జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలు కూడా లేరు. కేసులు పెడుతున్నా, కార్యకర్తలు ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నా పరామర్శించడానికి పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది నెల్లూరు జిల్లా. కార్యకర్తల బలం మాత్రం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ కార్యకర్తలు ఉన్నారు. ఆత్మకూరు, నెల్లూరు సిటీ తదితర ప్రాంతాల్లో బలమైన కార్యకర్తలు ఉన్నా వాళ్లకు ఆదుకునే సరైన నాయకుడు లేరు. నెల్లూరు మొత్తం మీద ఇప్పుడు వినిపిస్తున్న పేరు మాజీ మంత్రి నారాయణ. ఆయన గతంలో మంత్రిగా అభివృద్ధి పనులు చేసి ఉండటం వల్ల అర్బన్ లో మంచి పేరు ఉంది. కానీ రాబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారో లేదో తెలియదు. ఆయన కుమార్తె రాజకీయాల్లోకి వస్తుంది అని అంటున్నారు. ఇలా నెల్లూరు జిల్లాలో తప్పులు తెలిసినా, లోపాలు తెలిసినా సరిదిద్దుకోలేని పరిస్థితిలో చంద్రబాబు చేయి దాటి పోయింది. ఇక ప్రజలే కరుణించి నాయకులు ఎవరైనా సరే ఓట్లు వేద్దాం అని ప్రత్యర్ధి పార్టీపై విసిగిపోయి ఓట్లు వేయాలి తప్ప టీడీపీ నాయకులను చూసి ఓట్లు వేయడం అనేది కష్టమే అని చెప్పుకోవచ్చు.