YS Viveka: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అనేక ఆరోపణలు, కొన్ని దారుణమైన నిజాలు కూడా బయటకు వస్తున్నాయి. కొందరు సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్లు బయటకు వస్తున్నాయి. సీబీఐకి ఎవరో బయటి వ్యక్తులు చెప్పిన అంశాలు కావు. వైఎస్ కుటుంబ సభ్యులు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాలే ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైఎస్ ప్రతాప్ రెడ్డి, వైఎస్ ప్రకాష్ రెడ్డి, వైెఎస్ అభిషేక్ రెడ్డి, వైఎస్ సునీతారెడ్డి, సునీతా రెడ్డి భర్త రాజశేఖరరెడ్డి లు ఇచ్చిన స్టేట్మెంట్లు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇదే సందర్భంలో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ నెల రోజుల ముందే బయటకు వచ్చింది. అదే సందర్భంలో ఉదయ శంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ లను ప్రజలు చూశారు. వివేకా అల్లుడే చేయించారని వైసీపీ నుండి వస్తున్న ఆరోపణలు ప్రజలు వింటున్నారు. ఈ మొత్తం రాజకీయ డ్రామాలో వైసీపీకి ఏమైనా నష్టం ఉందా..? జగన్మోహనరెడ్డికి ఏమైనా ఓట్లు పోతాయా..? వివేకా హత్య కేసుకు సంబంధించి వైసీపీకి జరిగే రాజకీయ నష్టం ఎంత..? అనే విషయాలను పరిశీలిస్తే…
YS Viveka: భ్రమల్లో టీడీపీ
వివేకానంద రెడ్డిని చంపింది ఆ కుటుంబ సభ్యులే, సో.. ఆ కుటుంబానికి ఎవరూ ఓట్లు వేయరు, ఇక టీడీపీ అధికారంలోకి వచ్చేసినట్లే అన్న భ్రమలో ఆ పార్టీ వాళ్లు ఉండవచ్చు. నిజానికి వివేకా హత్య కేసు పూర్తిగా క్లైమాక్స్ లోకి రాలేదు. ఈ నేరం వీళ్లే చేశారు అని అన్ని రకాల ఆధారాలను సీబీఐ చూపించలేదు. సీబీఐ వాదనలపై కోర్టు ఇంత వరకూ ఎవరికి శిక్షలు విధించలేదు. సీబీఐ అన్ని రకాల ఆధారాలు, సాక్షాలు కోర్టుకు సమర్పించాలి. వాటిని ప్రజలు నమ్మాలి. కోర్టులు వాటిని నమ్మి శిక్షలు ఖరారు చేయాలి. కోర్టు శిక్షలు ఖరారు చేస్తే కొంత మేరకు ప్రజలు నమ్ముతారు. ఇవన్నీ జరగితే కేసు ఫైనల్ అయినట్లు. ఇవన్నీ జరగాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. సీబీఐ ఈ రోజు అరెస్టు చేసినా వెంటనే నిరూపించే అవకాశం ఉండదు. వెంటనే శిక్షలు వేయడం ఉండదు. దానికి కొంత ప్రొసీజర్ ఉంటుంది.
YS Viveka: రాజకీయంగా వైసీపీకి ఎంత నష్టం..?
రాజకీయంగా వైసీపీకి ఎంత నష్టం అనేది చెప్పుకోవాలంటే.. కడప జిల్లా పులివెందుల ప్రాంతంలో అయితే పెద్దగా నష్టం ఉండదు. పులివెందుల ప్రాంతం వైసీపీ కుటుంబానికి కంచుకోట లాంటిది. ఆ కుటుంబంపై ఎన్ని రకాల ట్విస్ట్ లు బయటకు వచ్చినా అక్కడి ప్రజలు నమ్మరు. అప్పట్లో రాజశేఖరరెడ్డికి, ఇప్పుడు జగన్మోహనరెడ్డికి మాత్రమే ఓట్లు వేస్తారు. వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో రకరకాలుగా వస్తున్న ఆరోపణల వల్ల పులివెందుల ప్రాంతంలో వైసీపీకి జరిగే నష్టం ఏమి ఉండదు. ఒక వేళ వివేకా కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే రెండు మూడు శాతం వరకూ ఓట్లు తగ్గవచ్చు గానీ అంతకు మించి జరిగేది ఏమి లేదు. పులివెందులలో ప్రభావం లేనట్లే కడప పార్లమెంటరీ నియోజకవర్గంలోనూ ప్రభావం ఉండదు. ఈ నియోజకవర్గంలో ముస్లిం, బీసీ, ఎస్సీ సామాజికవర్గ ఓటింగ్ ఎక్కువ. వీళ్లంతా వైఎస్ కుటుంబానికి కంకణబద్దులుగా ఉంటారు.
వైెఎస్ కుటుంబానికి కంచుకోట
వైెఎస్ కుటుంబానికి ఇటువంటివి ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆధారాలతో సహా నిరూపితమైనా సరే నమ్మరు. నమ్మినా సరే ఓట్లు వేయడం మానరు. సో కడప ఎంపీ స్థానానికి వైసీపీ తరపున ఎవరు పోటీ చేసినా రాజకీయంగా వచ్చే నష్టం ఏమి ఉండదు. వైఎస్ సునీతా రెడ్డి వ్యతిరేకంగా మారి ఆ కుటుంబ నుండి ఎవరైనా పోటీకి దిగడం గానీ, ప్రచారం చేసి కొంత సానుభూతి పండిస్తే మాత్రం కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక అయిదు శాతం ఓటింగ్ పై ప్రభావం పడుతుంది. పులివెందులతో పాటు కడప జిల్లాలో వైఎస్ కుటుంబాన్ని ఆరాధిస్తారు. ప్రేమిస్తారు. ఓట్లు వేస్తారు. అయితే వివేకా హత్య కేసు విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ కేసులో ఎవరి మీద అయితే అనుమానాలు వస్తున్నాయో వారిపై నేరం నిరూపణ అయి శిక్ష పడితే మాత్రం మూడు నాలుగు జిల్లాల్లో కొంత మేర ప్రభావం పడుతుంది. కోర్టులో నేరం నిరూపణ అయ్యే వరకూ ఏటువంటి నష్టం వైసీపీకి జరగదు. వైసీపీకి నష్టం జరుగుతుందని టీడీపీ అంచనాలు వేసుకోవడం కూడా అనవసరం.