YSRCP MP: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన అనూహ్య గెలుపు మత్తు నుండి ఇప్పుడిప్పుడు ఆ ప్రజా ప్రతినిధులు ఎంపీలు, ఎమ్మెల్యేలు దిగుతున్నారు. ఈ రెండున్నర సంవత్సరాలు అయ్యింది. వారిలో గెలుపు ఉత్సాహం ఆవిరి అయ్యింది. ఇప్పుడు రకరకాల వర్గాలు, భిన్నమైన వర్గాలు వైసీపీ పరిపాలన పట్ల, జగన్మోహన రెడ్డి తీరు పట్ల కాస్త వ్యతిరేకంగా మారే సరికి ఈ ప్రజా ప్రతినిధుల్లో అప్రమత్తత మొదలైంది. ఒక రకమైన భయం మొదలైంది. చాలా మంది అప్రమత్తం అవుతున్నారు. క్షేత్ర స్థాయిలో తిరుగుతున్నారు. మళ్లీ తమ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి అడుగులు వేసుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉంది. సవ్యంగానే సాగుతోంది. అయితే వైసీపీ నుండి 22 మంది ఎంపీలు గెలిస్తే అందులో ఒకరు రఘురామకృష్ణం రాజు ఆ పార్టీ చేజారిపోయారు. ఆయన రెబల్ గా మారారు. మిగిలిన ఎంపీల్లో ఎవరు గెలుస్తారు. ఎవరు ఓడిపోతారు అనేది ఇప్పడే చెప్పడం కష్టం, అప్పుడు ఉన్న పరిస్థితులు, సమీకరణాల బట్టి మారుతుంటుంది. అయితే ఇద్దరు ఎంపీలు మాత్రం వైసీపీలో మింగలేక కక్కలేక పార్టీపై అసంతృప్తి బయటకు చెప్పలేక అసంతృప్తి ఉందో లేదో తమ సొంత మనుషుల వద్ద చెప్పలేక అంతర్గతంగా నలిగిపోతున్నారు అనే కంటే పార్టీలో ఒంటరిగా మిగిలిపోతున్నారు. పూర్తిగా అర్జస్ట్ కాలేకపోతున్నారు అనేది మాత్రం చెప్పుకోవచ్చు. ఆ ఇద్దరిలో ఒకరు ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి, రెండవ ఎంపి ఆదాల ప్రభాకరరెడ్డి. ఎందుకంటే వీరు ఇద్దరూ కూడా వైసీపీకి కొత్త. 2019 ఎన్నికలకు నెల, రెండు నెలల ముందు మాత్రమే పార్టీకి వచ్చారు.
YSRCP MP: ఇదీ మాగుంట పరిస్థితి
మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబానికి రాజకీయ చరిత్ర ఉంది. ఆ కుటుంబం అయిదు సార్లు ఎంపీగా గెలిచిన చరిత్ర ఉంది. ఆయన 2014లో టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయిన తరువాత తాను ఎంపీగా గెలవాలంటే వైసీపీలో చేరాల్సిందేనన్న ఆలోచనకు వచ్చి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఎంపీగా గెలిచారు. అయితే ఆయనకు ఆ జిల్లాలో అంతగా అనుకూల పరిణామాలు లేవు. ఎందుకంటే..అప్పటి వరకూ అక్కడ ఎంపిగా పని చేసిన వైవీ సుబ్బారెడ్డికి, మాగుంటకు పడలేదు. మాగుంట రాకను వైవీ సుబ్బారెడ్డి స్వాగతించలేదు. ఇప్పటికీ వైవీ సుబ్బారెడ్డితో మాటలు లేవు. అప్పట్లో మాగుంటను పార్టీలోకి తీసుకువచ్చిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో దూరం పెరిగింది. వాళ్లు దూరం పెడుతున్నారో లేదో తెలియదు కానీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. వాళ్ల అనుచరులు, వీళ్ల అనుచరులు వేరువేరు గ్రూపులుగా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో కీలకమైన నేతలు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పడక, వైవీ సుబ్బారెడ్డితో పడక మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒకరకంగా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఆయన పార్టీలో పూర్తిగా కలవలేకపోతున్నారు. ఇటు ఎమ్మెల్యేలు కూడా ఏదైనా పని కావాలంటే ఆయన వద్దకు వెళ్లడం లేదు, మంత్రి వద్దకే వెళుతున్నారు. ఎమ్మెల్యేలే కాదు మండల స్థాయి, దిగువ స్థాయి కార్యకర్తలు కూడా మంత్రి బాలినేని వద్దకే వెళుతున్నారు. కేవలం మాగుంట వర్గమే ఆయన వద్దకు వెళుతోంది తప్ప ఇతర వైసీపీ శ్రేణులు ఎవరూ ఆయన వద్దకు వెళ్లడం లేదు. మాగుంట వర్గం అంటే ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఆయన వెన్నంటి ఉండేవాళ్లు. వైసీపీ శ్రేణులు ఆయన వద్దకు రావడం లేదు. ఒక వేళ వచ్చినా ఆయన ఏమీ చేయలేకపోతున్నారు అన్న అసంతృప్తి ఉంది. వీటికి సంబంధించి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ప్రధానంగా ఒక ఉదాహరణగా తీసుకుంటే కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో రిమ్స్ ఆసుపత్రికి బెడ్స్ విరాళంగా ఇచ్చారు మాగుంట. ఆ బెడ్స్ ను చాలా కాలం వాడలేదు. దాదాపు రెండు నెలలు మూలనపెట్టేసి ఉంచారు. ఆ తరువాత మాగుంట ట్రస్ట్ తరపున కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తే దానికి అనుమతి ఇవ్వలేదు. వీటిని బట్టి చూస్తేనే అధికార పార్టీలో ఆయన పరిస్థితి ఏ విదంగా అర్ధం చేసుకోవచ్చు. బయటకు చెప్పలేక మింగలేక కక్కలేక తర్జనభర్జన పడుతున్నారు అనేది వాస్తవం.
అనూహ్యంగా రాత్రికి రాత్రే వైసీపీలోకి
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి విషయం చూసుకుంటే..ఆయన కూడా అనూహ్యంగా టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చారు. రాత్రికి రాత్రి జంప్ అయ్యారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన చేసిన పనులకు బిల్లులు వచ్చాయి, ఆవి వచ్చిన వెంటనే వైసీపీలోకి జంప్ అయ్యారు. మంచి మెజార్టీతో గెలిచారు. అప్పటి వరకూ అక్కడ ఎంపిగా ఉన్న మేకపాటి రాజమోహనరెడ్డిని కాదని ఆదాల ప్రభాకరరెడ్డికి జగన్ ఎంపీ సీటు ఇచ్చారు. ఆయన గెలిచారు. గెలిచిన తరువాత ఆయన కూడా జిల్లాలో కీలకంగా చక్రం తిప్పుతున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఇంకొంత మంది కీలక నాయకులతో ఆయనకు పడటం లేదు. అటు ఎంపీ స్థానం వదలుకున్న రాజమోహనరెడ్డితోనూ పడటం లేదు. ఇప్పుడు జిల్లాలో చక్రం తిప్పుతున్న మేకపాటి కుటుంబంతో ఎవరితోనూ పడటం లేదు. అంటే వీళ్ల మధ్య సన్నిహిత సంబంధాలు లేవు. అప్పుడప్పుడు సమావేశాల్లో నేతలు కలుస్తున్నా వాళ్ల మనసులు కలవడం లేదు. మనుషులు అయితే కలుస్తున్నారు కానీ మనసులు కలవడం లేదు. మనసులు కలిస్తేనే రాజకీయం జాగ్రత్తగా ఉంటుంది. మనస్పర్ధలు కొనసాగిస్తూ కలవడం వల్ల వాళ్ల రాజకీయం ఎక్కువ కాలం నిలబడదు. ఈ ఇద్దరు ఎంపీల భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అనేది ఇప్పట్లో చెప్పే పరిస్థితి అయితే లేదు. కాకపోతే వీళ్లు సీఎం జగన్మోహనరెడ్డితో భేటీ కావాలని అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నారని సమాచారం.