Salaar: ఉగ్రం, కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. గత ఏడాది సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన తొలి ప్రాజెక్ట్ ఇది. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరీరావు, టిన్ను ఆనంద్, బాబీ సింహా, బ్రహ్మాజీ, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రలను పోషించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించాడు. 2023 డిసెంబరు 22న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లో విడుదలైన సలార్ పార్ట్ 1 భారీ విజయాన్ని అందుకుంది.
బాక్సాఫీస్ వద్ద రూ. 750 కోట్ల రేంజ్ లో వసూళ్లను సాధించింది. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలతో వరుస పరాజయాలను మూటగట్టుకున్న ప్రభాస్.. సలార్ తో హిట్ కొట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఎన్ని ప్రశ్నలకు లీడ్ ఇస్తూ సలార్ పార్ట్ 1ను ముగించారు. దీంతో సలార్ పార్ట్ 2పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. రెండో భాగం షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల నటుడు బాబీ సింహా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సలార్ పార్ట్ 2 షూటింగ్ ఏప్రిల్లో మొదలవుతుందని వెల్లడించి డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా చేశారు.
సలార్ పార్ట్ 2 చిత్రానికి శౌర్యాంగ పర్వం అనే టైటిల్ను ఇప్పటికే మేకర్స్ కన్ఫార్మ్ చేశారు. ఫస్ట్ పార్ట్ లో ప్రాణ స్నేహితులుగా అలరించిన ప్రభాస్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్.. రెండో భాగంలో బద్ధ శత్రువులుగా కనిపించబోతున్నారు. 2025 ఎండింగ్ లో సలార్ రెండో భాగం విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సలార్ మూవీకి సంబంధించి తాజాగా ఓ టాప్ సీక్రెట్ బయటపడింది. అదేంటంటే.. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కు ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కాదట.
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మొదట సలార్ మూవీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయాలని భావించాడట. ఆర్ఆర్ఆర్ మూవీతో బిజీగా ఉన్న సమయంలో రామ్ చరణ్ మరియు చిరంజీవిలను కలిసి సలార్ స్టోరీ లైన్ ను కూడా వినిపించాడట. కథ నచ్చడంతో రామ్ చరణ్ సినిమా చేసేందుకు అంగీకారించాడు. కానీ ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాలతో సలార్ నుంచి రామ్ చరణ్ తప్పుకున్నాడట. దాంతో ప్రశాంత్ నీల్ మరో ఆలోచన లేకుండా ప్రభాస్ కు కథ చెప్పి సలార్ మూవీ చేసేందుకు ఒప్పించాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే రామ్ చరణ్ నిజంగా అన్ లక్కీ అనే చెప్పుకోవాలి.
కాగా, ప్రభాస్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్ లు ఆయన లైనప్లో ఉన్నాయి. అందులో కల్కి 2898 ఏడీ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, సి. అశ్వని దత్ నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అలాగే మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ అనే మూవీలో ప్రభాస్ నటిస్తున్నాడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే చిత్రానికి కమిట్ అయ్యాడు.