Tillu Square: టాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ, మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ టిల్లు స్క్వేర్. గత వారం భారీ అంచనాల నడుమ విడుదలైన మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడం, పోటీగా మరే సినిమా లేకపోవడంతో టిల్లు గాడు థియేటర్స్ లో దుమ్ము లేపుతున్నాడు. విడుదలైన మూడు రోజుల్లోనే క్లీన్ హిట్ గా నిలిచిన టిల్లు స్క్వేర్.. ఇప్పుడు భారీ లాభాలతో దూసుకుపోతోంది. 100 కోట్ల క్లబ్ లో చేరేందుకు పరుగులు పెడుతుంది. వర్కింగ్ డేస్ లో కూడా కలెక్షన్స్ పరంగా వీర బాదుడు బాదుతోంది.
తాజాగా టిల్లు స్క్వేర్ 5 డేస్ వసుళ్ల లెక్క బయటకు వచ్చింది. ఐదు రోజుల్లో టిల్లు స్క్వేర్ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. రిలీజ్ కు ముందు ప్రపంచవ్యాప్తంగా టిల్లు స్క్వేర్ సినిమాకు రూ. 27 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో సిద్ధు జొన్నలగడ్డ టార్గెట్ రూ. 28 కోట్లు. అయితే ఈ టార్గెట్ ను సిద్ధు చాలా సులభంగా క్రాస్ చేసి మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు.
థియేటర్స్ లో ఐదు రోజుల రన్ ను పూర్తి చేసుకున్న టిల్లు స్క్వేర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 30.76 కోట్ల షేర్, రూ. 49.00 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా రూ. 44.01 కోట్ల షేర్, రూ. 85 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. 5వ రోజు వీక్ డే అయినప్పటికీ అన్ని చోట్లా అదిరిపోయే కలెక్షన్స్ ను వసూల్ చేసింది. వరల్డ్ వైడ్ గా రూ. 3.7 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం రూ. 16.01 కోట్ల ప్రాఫిట్ తో టిల్లు స్క్వేర్ ఎక్స్ లెంట్ జోరు చూపిస్తోంది. కాగా, మల్లిక్ రామ్ డైరెక్ట్ చేసిన టిల్లు స్క్వేర్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంలో నిర్మించారు. 2022లో విడుదలైన సూపర్ డూపర్ హిట్ డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ ఇది. ఎస్. థమన్ ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించగా.. సౌండ్ట్రాక్ ను రామ్ మిరియాల, శ్రీ చరణ్ స్వరపరిచారు.
సింపుల్ స్టోరీ అయినా కూడా.. టిల్లు క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ తో సిద్ధు జొన్నలగడ్డ నటనా శైలి, అనుపమ పరమేశ్వరన్ గ్లామర్, మ్యూజిక్ సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టాయి. ఇక టిల్లు స్క్వేర్ సక్సెస్ తో సిద్ధు జొన్నలగడ్డ మీడియం రేంజ్ హీరోల జాబితాలో చేరిపోయాడు. ప్రస్తుతం సిద్ధు చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఉన్నాయి. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకత్వంలో `తెలుసు కదా` అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో రాశీఖన్నా , శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా ఎంపిక అయ్యారు. అలాగే జాక్ అనే మూవీకి కూడా సిద్ధు జొన్నలగడ్డ కమిట్ అయ్యాడు. బిమ్మరిల్లు భాస్కర్ జాన్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.