Yuvina Parthavi: యువినా పార్థవి.. అంటే గుర్తుకు రావడం కాస్త కష్టమే. కానీ రాక్షసుడు మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ అంటే మాత్రం ఆమె టక్కున గుర్తుకు వస్తుంది. కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీనే రాక్షసుడు(తమిళంలో మాస్). వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సూర్య తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. ప్రణీత, లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్లుగా నటించారు. మేధా క్రియోషన్స్ బ్యానర్ పై ఎం.ఎస్.ఆర్, మిర్యాల రాజాబాబు నిర్మించిన ఈ సినిమా 2015లో విడుదలైంది. అయితే ఈ చిత్రంలో సూర్య కూతురిగా మేఘా పాత్రలో నటించిన చిన్నారి గుర్తుందా.. ఇప్పుడామె ఎలా ఉందో చూస్తే కచ్చితంగా షాకైపోతారు.
ఆ చిన్నారి పేరు యువినా పార్థవి. 2011లోనే ఆమె నటనా ప్రస్థానం ప్రారంభం అయింది. ఏవీఎమ్ ప్రొడక్షన్స్ యొక్క టీవీ సీరియల్ ఉరవుక్కు కై కొడుప్పోమ్ ద్వారా యువినా పార్థవి ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టింది. ఈ సీరియల్ విజయంలో యువినా కీలక పాత్రను పోషించింది. అతి చిన్న వయసులో ఎంతో అద్భుతంగా నటిస్తూ ఆకట్టుకుంది. దాంతో ఆమెకు సినిమాల్లో కూడా ఛాన్సులు రావడం ప్రారంభం అయ్యాయి.
అలా 2013లో ఎమ్. శరవణ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ఇవాన్ వెరమత్రి ద్వారా యువినా బాల నటిగా తొలిసారి వెండితెరపై మెరిసింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా యువినా యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వీరం, మంజపాయి, అతిథి, మేఘా, అరణ్మనై, కత్తి, అభిమన్యు, మాస్, స్ట్రాబెర్రీ, కాకి, పుష్పక విమానం ఇలా అనేక తమిళ్, కన్నడ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. అజిత్ కుమార్, దళపతి విజయ్, సూర్య వంటి అగ్రహీరోలతో తెర పంచుకుంది.
అయితే 2018 నుంచి ఆన్ స్క్రీన్ పై కనిపించని యువినా పార్థవి.. ఇప్పుడు చాలా పెద్దదైంది. ఎంతో గ్లామరస్ గా తయారైంది. టీనేజ్ లో ఉన్న యువినా రీసెంట్ గా సైరన్ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయం రవి హీరోగా యాక్ట్ చేస్తే.. కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, సముద్రఖని, యోగి బాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో జయం రవి కూతురు మలార్ గా ముఖ్యమైన క్యారెక్టర్ ను యువినా ప్లే చేసింది.
ఈ చిత్రం 2024 ఫిబ్రవరి 16న విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. సైరన్ లో యువినా పాత్రకు కూడా మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఇప్పుడు యువినాకు మరిన్ని ఆఫర్లు క్యూ కడుతున్నాయి. త్వరలోనే ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఇక సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ ఉండే యువినా పార్థవి.. నిత్యం తన ఫోటోలను, వీడియోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తుంటుంది. ఈ బ్యూటీకి ఇన్స్టాలో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే యువినా చాలా పెద్దది కావడంతో.. ఆమె లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరియు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.