Anchor Syamala: తెలుగు సినిమా పరిశ్రమలో సుదీర్ఘకాలం నుంచి యాంకర్ గా సత్తా చాటుతున్న వారిలో శ్యామల ఒకరు. 17 ఏళ్ల వయసులోనే టాలెంట్ హంట్ షో ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన శ్యామలకు మొదట సీరియల్స్ లో అవకాశం వచ్చింది. అభిషేకం, లయ తదితర సీరియల్స్ ఆమె నటించింది. ఆ తర్వాత మెల్లమెల్లగా యాంకరింగ్ పై పట్టు సాధించింది. బుల్లితెరపై మా ఊరి వంట, పట్టుకుంటే పట్టు చీ,ర లక్ష్మీ రావే మా ఇంటికి వంటి ఎన్నో టీవీ షోస్ కు యాంకర్ గా చేసింది.
తనదైన అందం మరియు మాట తీరుతో యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికే టీవీ షోలు మరియు సినిమా ఈవెంట్స్ తో ఫుల్ బిజీ యాంకర్ గా సత్తా చాటుతోంది. మరోవైపు వెండితెరపై కూడా అడుగుపెట్టింది. లౌక్యం, ఒక లైలా కోసం, గుండెల్లో గోదారి, ఇంటింటా అన్నమయ్య, విరూపాక్ష తదితర చిత్రాల్లో అక్క, వదిన వంటి పాత్రల్లో నటించి మెప్పిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్యామల.. కెరీర్ ఆరంభంలో తాను ఫేస్ చేసిన స్ట్రాగుల్స్ ను రివీల్ చేసింది. ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలను నిర్మొహమాటంగా బయట పెట్టేసింది.
శ్యామల మాట్లాడుతూ.. `సినిమాల్లో నటించాలన్న కోరికతో మా అమ్మని తీసుకుని నేను హైదరాబాద్ కు వచ్చాను. మొదట సీరియస్ లో అవకాశాలు వచ్చాయి. అయితే ఆ సమయంలో కొంతమంది నన్ను బాగా విసిగించేవారు. లవ్ ప్రపోజ్ చేసి ఇబ్బంది పెట్టేవారు. ఓ కెమెరామెన్ నన్ను దారుణంగా వేధించాడు. రాత్రుళ్లు ఫోన్ చేసి తప్పు తప్పుగా మాట్లాడుతూ టార్చర్ పెట్టాడు.
ఓసారి అమ్మకు ఫోన్ చేసి మీకు మగదిక్కు లేదు.. నేను మిమ్మల్ని చూసుకుంటా.. మీ కూతురికి చెప్పండి. నేను చెప్పిన దానికి ఒప్పుకోకుంటే ఏదైనా చేయడానికి వెనకాడను అని బెదిరించాడు. దాంతో అమ్మ చాలా భయపడింది. సీరియల్స్ మానేసి ఎక్కడికైనా వెళ్లిపోదామని చెప్పింది. కానీ నాకేం కాదని అమ్మకు ధైర్యం చెప్పి కెరీర్ లో ముందుకు సాగాను` అంటూ శ్యామల చెప్పుకొచ్చింది. దీంతో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.