Tollywood Actor: పైన ఫోటోలో కనిపిస్తున్న బుడ్డోడు ఎవరో గుర్తు పట్టారా..? టాలీవుడ్ లో ఇప్పుడతను క్రేజీ హీరో. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు. తనదైన నటనా శైలితో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. యూత్ లో భారీ ఫాలోయింగ్ ను ఏర్పర్చుకున్నాడు. తన లుక్స్ తో అమ్మాయిలను ఇట్టే పడేసి సదరు హీరో.. సినిమాల్లో మాత్రం అమ్మాయిల చేతుల్లో దారుణంగా మోసపోతుంటారు. ఈ పాటికే మీరు ఆ బుడ్డోడు ఎవరో గెస్ చేసి ఉంటారు.. ఎస్ అతనే స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.
1992న హైదరాబాద్ లో సాయికుమార్ జొన్నలగడ్డ మరియు శారద దంపతులకు సిద్ధు జొన్నలగడ్డ జన్మించాడు. సిద్ధు తండ్రి వ్యాపారవేత్తగా కాగా.. తల్లి దాదాపు పాతికేళ్లు ఆలిండియా రేడియోలో వర్క్ చేశారు. తల్లితో కలిసి సంగీత కార్యక్రమాలకు వెళ్ళడం వల్ల సిద్ధు జొన్నలగడ్డకు మ్యూజిక్ పై ఆసక్తి ఏర్పడింది. ఆ ఆస్తక్తితోనే తబలా వాయించడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ప్రభుదేవా స్ఫూర్తితో డ్యాన్స్ లో శిక్షణ తీసుకున్నాడు.
బీటెక్ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లోకి రావాలని డిసైడ్ అయ్యాడు. ఎంబీయే చదువుకుంటూ సినిమాల్లో ఛాన్సులు కోసం సిద్ధు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్ ద్వారా సిద్ధు జొన్నలగడ్డ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. వాసు వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సిద్ధు కాలేజీ స్డూడెంట్ గా నటించాడు. ఆ తర్వాత రామ్ చరణ్ ఆరెంజ్, న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన భీమిలి కబడ్డీ జట్టు, మాస్ మహారాజా రవితేజ యొక్క డాన్ శీను చిత్రాల్లో సిద్ధు చిన్న చిన్న పాత్రలను పోషించాడు.
2014లో బాయ్ మీట్స్ గార్ల్ మూవీతో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మారాడు. కానీ ఈ చిత్రం ఎప్పుడు థియేటర్స్ లోకి వచ్చిందో కూడా ప్రేక్షకులకు తెలియదు. అయితే 2016లో వచ్చిన గుంటూరు టాకీస్ మూవీతో సిద్ధుకి గుర్తింపు వచ్చింది. సిద్ధు హీరోగా నటించడమే కాకుండా ఈ సినిమాకు కథ, డైలాగ్స్ కూడా అందించాడు. 2019లో ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన కల్కి చిత్రంలో విలన్ గా సిద్ధు తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. 2020లో కృష్ణుడు మరియు అతని లీల, మా వింత గాధ వినుమా వంటి చిత్రాలతో సిద్ధు ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఇవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
కానీ 2022లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన DJ టిల్లు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ సిద్ధు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సిద్ధు కెరీర్ గురించి చెప్పుకోవాలంటే.. డీజే టిల్లుకు ముందు డీజే టిల్లు తర్వాత అనే చెబుతారు. అంతలా ఈ సినిమా అతని కెరీర్ ను నిలబెట్టింది. తాజాగా ఇదే చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ మూవీతో వచ్చాడు. మల్లిక్ రామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. మార్చి 29న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద వసూళ్లను ఓ రేంజ్ లో కుమ్మేస్తోంది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ స్టైలిస్ట్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకత్వంలో తెలుసు కదా అనే చిత్రం చేస్తున్నాడు. రాశీఖన్నా , శ్రీనిధి శెట్టి ఇందులో కథానాయికలుగా నటించనున్నారు. గత ఏడాది అక్టోబర్ లో ఈ చిత్రం ప్రారంభం అయింది. అలాగే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ అనే సినిమాకు కూడా సిద్ధు కమిట్ అయ్యాడు.