Bangladesh Election Result 2024: బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ భారీ విజయాన్ని సాధించింది. మూడింట రెండొంతుల స్థానాలను కైవశం చేసుకుని జయకేతనం ఎగురవేసింది. 299 నియోజకవర్గాలకు గానూ 223 సీట్లను గెలుచుకుని రికార్డు స్థాయిలో వరుసగా నాలుగో సారి అధికార పీఠాన్ని దక్కించుకున్నారు హసీనా.
ప్రధాన ప్రతిపక్షం బీఎన్ పీ 11 సీట్లకే పరిమితం కాగా, ఇండిపెండెంట్ అభ్యర్ధులు ఏకంగా 61 స్థానాల్లో విజయం సాధించారు. ఎన్నికల్లో బీఎన్ పీ పార్టీ అభ్యర్ధులు పోటీ చేయకపోవడంతో హసీనా అవామీ లీగ్ పార్టీ విజయం ఎన్నికల ముందే ఖరారైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాని హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష బీఎన్ పీ పార్టీ ఉగ్రవాదులతో కుమ్మకై ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి భయపడిందన్నారు.
ప్రధాన ప్రతిపక్షం ఎన్నికలను బహిష్కరించి తనను గెలిపించలేదనీ, బంగ్లాదేశ్ ప్రజలు గెలిపించారని అన్నారు. సహజంగానే బంగ్లాదేశ్ ప్రజలు చాలా తెలివైన వారని అన్నారు. రానున్న అయిదేళ్లలో దేశ ఆర్ధిక వ్యవస్థ పరుగులు పెట్టిండమే తన లక్ష్యమని పేర్కొన్నారు. 2041 నాటికి బంగ్లాదేశ్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. స్మార్ట్ ఎకానమి, స్మార్ట్ ప్రభుత్వం, స్మార్ట్ ప్రజలు తన లక్ష్యాలుగా పేర్కొన్నారు.
గోపాల్ గంజ్ – 3 స్థానంలో గెలుపొందిన ప్రధాని షేక్ హసీనా 1986 నుండి ఇప్పటి వరకూ వరుసగా ఎనిమిదో సారి అక్కడ విజయం సాధించారు. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా వరుసగా నాల్గోసారి. మొత్తంగా అయిదో సారి అధికారాన్ని చేపట్టనున్నారు.
YSRCP: మూడో జాబితా ప్రకటనకు సీఎం జగన్ కసరత్తు .. ఆ నేతలకు జగన్ పిలుపు