YSRCP: నియోజకవర్గాల ఇన్ చార్జిల మార్పు ప్రక్రియను వైసీపీ అధిష్టానం కొనసాగిస్తొంది. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి మూడో జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియతో వైసీపీలో టికెట్ కలవరం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ అభ్యర్ధులను పెద్ద ఎత్తున మార్చాలని నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు పార్టీ పెద్దల నుంచి పిలుపులు రావడంతో వారు సీఎంఓకు చేరుకున్నారు.
సోమవారం నందికొట్కూరు, మార్కాపురం, విజయనగరం, కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జుల నియామకానికి సంబంధించి ఆయా నేతలతో సీఎం వైఎస్ జగన్ చర్చలు జరుపుతున్నారు. నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి మార్పు కసరత్తులో భాగంగా ఆ నియోజకవర్గ ప్రస్తుత ఇంచార్జి బైరెడ్డి సిద్దార్థరెడ్డి సీఎంఓకు చేరుకున్నారు. నందికొట్కూరు ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్థర్ అభ్యర్థిత్వాన్ని బైరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన ఇక్కడి నుంచి కొత్త అభ్యర్థి ఎంపికపై చర్చించినట్టు తెలుస్తొంది. ఇక్కడ బైరెడ్డి ఎవరిని సూచించినా జగన్ జగన్ ఓకే చెప్పే పరిస్థితి ఉందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.
మరో పక్క ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ ఇన్ చార్జి మార్పునకు సంబందించి ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, జల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డిలకు పిలుపు రావడంతో వీరు ఇరువురు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. వీరితో సీఎం చర్చలు జరిపారు. అదే విధంగా విజయనగరం పార్లమెంట్ ఇంచార్జి నియామకంపై ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, వైసీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జి వైవి సుబ్బారెడ్డితో చర్చలు జరిపారు.
అలానే కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి నియామకానికి సంబంధించి డోన్ ఎమ్మెల్యే, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తో సీఎం జగన్ చర్చలు జరుపుతున్నారు. గతంలో బుగ్గన తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని, తన వారసుడికి టికెట్ ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేల వారసులకు అవకాశం కల్పించిన సీఎం జగన్ బుగ్గన విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదే క్రమంలో అసంతృప్తి నేతల బుజ్జగింపుల ప్రక్రియ కొనసాగుతోంది. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాను మరో సారి తాడేపల్లి, చిత్తూరు ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులూ సీఎంవోకు చేరుకున్నారు. వీరితో పాటు బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వచ్చారు. తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి తనను ఇన్ చార్జిగా నియమించి మళ్లీ తొలగించడం, ఆ స్థానాన్ని మాజీ మంత్రి మేకతోటి సుచరితకు ఇవ్వడం తదితర అంశాలపై ఇటీవల బహిరంగంగానే డొక్కా మాణిక్య వరప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
తనకు సీఎం ను కలిసేందుకు అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. తాను పార్టీ అభ్యర్ధుల విజయానికే కృషి చేస్తానని కూడా చెప్పారు. దీంతో ఆయనకు సీఎంఓ నుండి పిలుపు రావడంతో క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సీఎంఓకు వచ్చిన నేతలతో ముందుగా సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల చర్చలు జరుపుతున్నారు. సర్వే నివేదికలు, మార్పుల విషయాన్ని నేతలతో వీరు మాట్లాడుతున్నట్లు సమాచారం. ఆ తర్వాత పరిస్థితి, అవసరాన్ని బట్టి కొందరు ఎమ్మెల్యేలు, నేతలను సీఎం వైఎస్ జగన్ ను కలిసేందుకు పంపుతున్నారు. సంక్రాంతి పండుగ లోపు మూడో జాబితా విడుదల అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.