Deep Fake: డీఫ్ఫేక్ ల అడ్డుకట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీప్ఫేక్ ల పరిశీలన ఫిర్యాదుల కొరకు ప్రత్యేక అధికారిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్ మీడియా సంస్థలతో సమావేశం అనంతరం కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చింది. రెండు రోజుల కీలక సమావేశాల సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించారు. భారతీయ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా విధి విధానాల రూపకల్పనకు సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లకు ఏడు రోజుల సమయం ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు.
డీప్ ఫేక్ కంటెంట్ పై చర్య తీసుకునేలా అధికారిని నియమిస్తామని సోషల్ మీడియా కంపెనీలను కలిసిన తర్వాత మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ అంశాన్ని చెప్పారు. ప్రస్తుత ఐటీ రూల్స్ లోని రూల్ 31(14)(బీ)ని ఉల్లంఘించే కంటెంట్ ను వినియోగదారు ఫిర్యాదు చేసిన 36 గంటల్లో నిర్దిష్ట కంటెంట్ ను తొలగించాలని తెలిపారు. డీప్ ఫేక్ లు, చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మేటీరియల్ వంటివి కంటెంట్ ప్రస్తుతం భారతీయ ఇంటర్నెట్ లో ఆందోళన కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లు ఐటీ రూల్స్ ఉల్లంఘించిన సందర్బాలను వినియోగదారులు తెలిపేందుకు డిజిటల్ ప్లాట్ ఫారమ్ ను రూపొందించేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్ సెవెన్ అధికారిని నియమిస్తుందని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
ఉల్లంఘనలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందన్నారు. ఈ డిజిటల్ ప్లాట్ ఫారమ్ ను వినియోగదారులు చేసిన ఫిర్యాదు ను పరిష్కరించేందుకు ఉపయోగిస్తారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లు నిర్దిష్ట రకాల కంటెంట్ ను సృష్టించడం అనుమతించబడదని తమ వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ప్రస్తుత నియమాలు, చట్టాలు డీప్ ఫేక్ లను అనుమతించకూడదని అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లు అంగీకరించాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
ఐటీ రూల్స్ 2021 ప్రకారం నిర్దేశించిన వ్యవధిలోపు లేదా రిపోర్టింగ్ చేసిన 36 గంటల్లోపు ఆ కంటెంట్ ను తొలగించాలనీ లేదంటే చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు. డీప్ ఫేక్ లను సృష్టించినా, వ్యాప్తి చేసినట్లు రుజువైనా లక్ష రూపాయల వరకూ జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష తప్పదని ఇప్పటికే ప్రకటించారు. ప్రజాస్వామ్యానికి కొత్త ముప్పుగా పుట్టుకొస్తున్న డీప్ ఫేక్ లను వ్యాప్తి చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనలు తీసుకువస్తామని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం ప్రకటించారు.