Pawan Kalyan: విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద బాధితులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి పరామర్శించారు. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు ఒకొక్కరికి రూ.50వేల వంతున 49 మందికి పవన్ కళ్యాణ్ చెక్కులు అందజేశారు. తొలుత ఘటన ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ తాను ఇచ్చే డబ్బు కష్టాలు తీరుస్తుందని తాను నమ్మనని, కష్టాలు వస్తే జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నారనే భావన, కష్టాల్లో బతకనిస్తుందని చెప్పారు. మత్స్యకారులను తాను ఎప్పుడూ ఓటు బ్యాంకుతో ఆలోచించలేదన్నారు. కష్టాల్లో తమ వెంట నిలబడతానని చెప్పడం కోసం వచ్చానని తెలిపారు. సుమారుగా 25 కోట్ల మేర నష్టం జరిగిందని, పరిమితి వలన న్యాయం చేయలేకపోతున్నానని, ప్రతి మత్స్యకారుడికి అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంలో వైసీపీ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వల్ల రౌడీ మూకలు రాజ్యమేలుతున్నాయన్నారు. మరో నాలుగు నెలలు ఈ పాలనను భరిద్దామన్నారు. విశాఖలో భద్రతతో కూడిన హార్బర్ ని తీసుకొచ్చే బాధ్యత జనసేన తీసుకుంటుందన్నారు. దండుపాళ్యం బ్యాచ్ లా వైసీపీ రౌడీ మూకలు తయారని విమర్శించారు. మనం అధికారంలోకి వచ్చాక ఇక్కడ మెరైన్ పోలీసింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. చీకటిగా ఉన్న ప్రాంతంలో ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఆడవారు అర్థరాత్రి ధైర్యంగా తిరిగే పరిస్థితులు తీసుకొస్తామని తెలిపారు. వైసీపీని ఓడించడానికి చాన్స్ తీసుకోదల్చుకోలేదనీ, అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని వివరించారు. రేపటి రోజున 5వేల తేడాతో సీటు ఓడిపోకూడదనీ, గెలిస్తే 25 వేల ఓటల మెజార్టీతో గెలిచి వైసీపీని ఓడించాలన్నారు.
గత 3-4 ఏళ్లుగా ఈ ప్రాంతంలో కొన్ని గ్యాంగులు వస్తూ తెల్లవారుజామున వేటకు వెళ్లే మత్స్యకారులను బెదిరిస్తూ, మహిళలపై దాడులు చేస్తూ, డబ్బు దోచుకుంటున్నారు అనే విషయాలు వింటున్నామన్నారు. ఇప్పుడు రాష్ట్రమంతా కూడా ఇదే పరిస్తితి ఏర్పడిందని విమర్శించారు. దాదాపు 700 బోట్లు పట్టే ఈ హార్బర్ లో సరైన వసతులు ఉన్నాయా లేవా? అని ప్రశ్నించారు. మత్స్యకారుల కష్టాలు తనకు తెలుసునన్నారు. ఎంతో కండ బలం, గుండె బలం ఉంటే తప్ప ఈ వృత్తి చేయలేరని అన్నారు. గత వారం రోజులుగా తెలంగాణ లో ఎన్నికల పనులు, కీలక ప్రచారంలో ఉండి కూడా ఆపుకుని ఇక్కడకు రావడానికి కారణం కష్టాల్లో ఉన్న మత్స్యకారులకు అండగా నిలబడటానికేనని చెప్పారు. 400 కోట్లతో ఒక హార్బర్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. కానీ మన జగన్ బాబు మాత్రం రూ. 451 కోట్లతో ఉండటానికి రుషికొండలో ఇల్లు నిర్మించుకుంటున్నారన్నారు.
ఆయనకు ఉన్న రాజ భవనాలు సరిపోవు అన్నట్లు ఇప్పుడు రుషికొండ తోలచేసి 451 కోట్లతో నిర్మిస్తున్నారని పవన్ విమర్శించారు. సర్క్యూట్ హౌస్ లోనో, ఉన్న ప్రభుత్వ భవనాల్లో ఉండి పని చేయొచ్చు కదా అని పవన్ అన్నారు. తాను దాదాపు 15 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉండి అనుభవం తెచ్చుకున్నాననీ, ప్రజల సమస్యలు అర్దం చేసుకున్నానన్నారు. మత్స్యకారులు ఎలా అయితే లోతైన సముద్రంలోకి వెళ్లి వేటాడి చేపలు తెస్తారో, తాను ఈ అవినీతిని లోతుల నుండి వేటాడి కడిగివేయడానికి సిద్దంగా ఉన్నానన్నారు. తాను వైజాగ్ వస్తానన్నప్పుడల్లా ఎందుకు వైసీపీ ప్రభుత్వం భయపడుతుందో అర్ధం కావాడం లేదని అన్నారు. గతంలో వస్తే ఆపేశారనీ, ఇప్పుడు తాను బుక్ చేసుకున్న ఫ్లైట్ ను ఎవరో ఇంటెలిజెన్స్ అధికారి తాను రావడం లేదని, ప్రోగ్రామ్ కాన్సిల్ అని పంపించి వేశారని అన్నారు.
Mansoor Ali Khan: మన్సూర్ ను క్షమించేసిన త్రిష .. వివాదానికి తెర