Telangana Election: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడం కోసం పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అధికారులు చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేస్తున్నా గుట్టుచప్పుడు కాకుండా డబ్బు, మద్యం పంపిణీ జరుగుతోందని తెలుస్తొంది. ఎన్నికల అధికారులు ఇప్పటికే అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు, నేతల ఇళ్లల్లో, వాహనాల్లో తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో భారీగా నగదును స్వాధీనం చేసుకుంటున్నారు.
తాజాగా తెలంగాణ ఎన్నికల సందర్భంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 22 లోని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ నివాసానికి శుక్రవారం రాత్రి పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో ప్లైయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీలకు చేరుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. గోయల్ నివాసంలో భారీగా డబ్బు డంప్ చేశారన్న సమాచారం అందడంతో ఫ్లైయింగ్ స్క్వాడ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టేందుకు వచ్చింది. ఏకే గోయల్ పదవీ విరమణ అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాదారుగా పని చేశారు. అయితే ఆయన బీఆర్ఎస్ పార్టీ కోసమే డబ్బులు దాచి పెట్టారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోయల్ నివాసానికి అధికారులు రావడంతో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. అలానే బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
అయితే గోయల్ ఇంటి నుండి పలువురు మఫ్టీలోని కానిస్టేబుళ్లు నెంబర్ ప్లేట్ లేని బైక్ లపై డబ్బు బయటకు తీసుకువెళుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. అయితే గోయల్ నివాసంలోకి వెళ్లిన అధికారులను ఆయన అడ్డుకున్నట్లు తెలుస్తొంది. సెర్చ్ వారంట్ లేకుండా ఇంట్లోకి రావడానికి వీలులేదని చెప్పినట్లు తెలుస్తొంది. దాదాపు నాలుగు గంటల పాటు వేచి ఉన్న ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారి సెర్చ్ వారంట్ లేకపోవడంతో వెనుతిరిగినట్లు సమాచారం.
మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో డబ్బులు ఉంటే సీజ్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి డిమాండ్ చేశారు. వందల కోట్ల డబ్బు ఏకే గోయల్ ఇంట్లో ఉందని తమకు సమాచారం అందిందన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై లాఠీ చార్జీ చేశారని అన్నారు. పోలీసుల తీరును ఆయన తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అయిదు మోటారు సైకిళ్లపై డబ్బులు తరలించారని, ఆ వాహనాలకు ముందు, వెనకాల నెంబర్ ప్లేట్స్ లేవని మల్లు రవి చెప్పారు. ఏకే గోయల్ ఇంట్లో సుమారు రూ.200 కోట్ల నగదు ఉన్నట్లు గా భావిస్తున్నామన్నారు.
Deep Fake: డీప్ఫేక్ అడ్డుకట్టకు కేంద్రం కీలక నిర్ణయం