Covid Subvariant JN.1: దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు మళ్లీ నెమ్మదిగా పెరుగుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. కోవిడ్ కేసుల్లో పెరుగుదల, కేరళ రాష్ట్రంలో కొత్త సబ్ వేరియంట్ జే ఎన్ 1 (బీ 2.86.1.1) వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్రం సోమవారం ముందస్తు చర్యలకు దిగింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సుధాంశ్ పంత్ సోమవారం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.
ఇటీవల కాలంలో కేరళ లాంటి కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరిగాయనీ, ఇదే సమయంలో కొత్త వేరియంట్ ప్రభావం పెరిగిందని పేర్కొన్నారు. అందు వల్ల అన్ని ప్రభుత్వాలు తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. రాబోయే పండుగల సీజన్ ను దృష్టిలో పెట్టుకుని వైరస్ విస్తరించకుండా అడ్డుకోవడానికి తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలని, శ్వాసకోశ సంబంధ పరిశుభ్రత పాటించేలా చూడాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం ఇది వరకు జారీ చేసిన కోవిడ్ – 19 నియంత్రణ మార్గదర్శకాలను అమలు చేయాలని చెప్పారు. జిల్లాల వారీగా హాస్పటల్స్ కు వచ్చే ఐఎల్ఐ (ఇన్ ఫ్లుయెంజా లైక్ ఇల్ నెస్), సారి (సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ నెస్) రోగులను నిరంతరం పర్యవేక్షించాలని, వారి వివరాలను ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫామ్ లో నమోదు చేసి కేసుల పెరుగులదలను తొలి దశలోనే పసిగట్టాలని తెలిపారు.
కోవిడ్ -19 పరీక్ష మార్గదర్శకాల ప్రకారం.. అన్ని జిల్లాల్లో తగిన పరీక్షలు నిర్వహించాలని, అందులో కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన నిష్పత్తి ప్రకారం ఆర్టీపీసీఆర్, యాంటీజెన్ టెస్టులు నిర్వహించాలని తెలిపారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు అధికంగా చేపట్టి పాజిటివ్ నమూనాలను జన్యు పరిణామ విశ్లేషణ కోసం ఇన్స్ కాగ్ లేబరేటరీలకు పంపి కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించే ప్రయత్నం చేయాలని సూచించారు.
YSRCP: ఎన్నికల వేళ పెడన జనసేన కీలక నేత అనుచరులతో వైసీపీలోకి..