Chhattisgarh : మావోయిస్టుల బందీగా ఉన్న జవాన్ రాకేశ్వర్ సింగ్ ను వదిలివేశారు. అయిదు రోజులుగా రాకేశ్వర్ సింగ్ మవోయిస్టుల చెరలో ఉన్న సంగతి తెలిసిందే. తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో కొద్దిసేపటి క్రితం రాకేశ్వర్ సింగ్ ను మవోయిస్టులు విడిచిపెట్టారు. కాసేపటిలో ఆయన బెటాలియన్ కు చేరుకోనున్నారు. ఈ విషయాన్ని ఛత్తీస్గడ్ ఐజీ దృవీకరించారు.
ఇటీవల ఛత్తీస్గడ్ లోని బీజాపూర్ జరిగిన భారీ ఎదురుకాల్పులలో 22 మంది జవానులు అమరులు అయ్యారు. ఓ మహిళా మవోయిస్టు మృతి చెందింది. ఆ సమయంలో రాకేశ్వర్ సింగ్ నక్సలైట్ లకు బందీగా చిక్కారు. రాకేశ్వర్ సింగ్ ను విడుదల చేయడానికి తొలుత మవోయిస్టులు కొన్ని డిమాండ్ లు కూడా పెట్టారు. బుధవారం అతను క్షేమంగా ఉన్నట్లు ఫోటోను మీడియాకు మవోలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రాకేశ్వర్ సింగ్ కుమార్తె మావోలను ఉద్దేశించి ప్లీజ్ అంకుల్ మా డాడీని విడుదల చేయండి అంటూ వేడుకుంది.
మావోలు తమ ఆధీనంలో ఉన్న జవాన్ రాకేశ్వర్సింగ్ను వెంటనే విడుదల చేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక నేతలు జి హరగోపాల్, జి లక్ష్మణ్ రాఘవాచారి తదితరులు ప్రకటన కూడా విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చల దిశగా ముందడుగు వేయాలని, అందుకు తాము సహకరిస్తామని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో మవోలు ఎటువంటి డిమాండ్ లు లేకుండా జవాన్ ను విడుదల చేశారు.