Corona Death: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండగా వేల సంఖ్యలో మరణాలు సంభివిస్తున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే,. కొంత మంది రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలను కరోనా కబళించింది. తాజాగా రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్పీ) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ (82) కరోనాతో కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా కుటుంబ సభ్యులు గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మాజీ ప్రధాన మంత్రి చరణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్ రాజ్యసభ, లోక్ సభ సభ్యుడిగా పని చేశారు. యుపీఏ హయాంలో పౌరవిమానయాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అజిత్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అజిత్ సింగ్ మరణ వార్త తెలిసిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర ట్విట్టర్ వేదికగా స్పందించారు. రైతుల ప్రయోజనాల కోసం ఆయన నిబద్ధతతో పని చేశారని మోడీ ట్వీట్ చేశారు. గతంలో కేంద్ర మంత్రిగా తనకు ఇచ్చిన బాధ్యతలను అజిత్ సింగ్ సమర్థవంతంగా నిర్వహించారని పేర్కొన్నారు. ఆయన మరణ వార్త తనను కలచివేసిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసిఆర్, వైఎస్ జగన్మోహనరెడ్డి, ఏపి ప్రతి పక్ష నేత చంద్రబాబు తదితరులు ట్విట్టర్ వేదికగా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అజిత్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.