Corona Vaccination: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో మూడున్నర లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతోంది. అయితే కరోనా కట్టడికి దేశంలో నిర్వహిస్తున్న వాక్సినేషన్ కార్యక్రమం ప్రపంచ రికార్డు సాధించింది. కేవలం 99 రోజుల వ్యవధిలో 14 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ ను ఇచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. శనివారం రాత్రి వరకూ 14,08,02,794 టీకా డోసులను అందించామనీ, ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఇన్ని రోజుల వ్యవధిలో ఈ విధంగా వ్యాక్సినేషన్ రికార్డు సాధించలేదని కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.
తొలి దశలో 92.89 లక్షల మంది ఆరోగ్య శాఖ సిబ్బందికి తొలి డోసును అందించామనీ, వీరిలో 59.94 లక్షల మందికి రెండో డోసు కూడా అందించామని అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా కోటి 19లక్షల మంది ప్రంట్ లైన్ వర్కర్లలకు తొలి డోసు అందిందనీ, వీరిలో 62లక్షల 77 మందికి రెండో డోసును కూడా ఇచ్చామని తెలిపింది. ఇక 45 నుండి 60 సంవత్సరాల పైబడిన వారిలో 4.76 కోట్ల మందికి తొలి డోసు, వారిలో 23.22 లక్షల మందికి రెండో డోసు అందిందని పేర్కొన్నారు. 60 ఏళ్ల పైబడిన వారిలో 4.96 కోట్ల మందికి తొలి డోసును, వారిలో 77.02 లక్షల మందికి రెండో డోసును ఇచ్చామని అధికారులు వెల్లడించారు.
దేశంలో తొలి దశ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జనవరి 16న ప్రారంభించిన సంగతి తెలిసిందే. తరువాత రెండవ దశ మార్చి 1 నుండి 60 ఏళ్ల పైబడినవారికి, మూడవ దశ ఏప్రిల్ 1 నుండి 45 ఏళ్ల బడిన వారికి వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది, ఇక నాల్గవ దశలో భాగంగా మే 1వ తేదీ నుండి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలను అందిస్తామని ఇందు కోసం రిజిస్ట్రేషన్ ను ప్రారంభించారు.