భారత రాష్ట్రపతి ఎన్నికల ఫలితం తేల్చే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఢిల్లీలోని పార్లమెంట్ వదికగా జరుగుతున్న ఓట్ల లెక్కింపులో మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఎంపీల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. ఈ ఓట్ల లెక్కింపులో అధికార ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ము స్పష్టమైన ఆధిక్యత సాధించారు. ఎంపీల ఓట్లలో ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు రాగా వాటి విలువ 3,78,00లుగా అధికారులు నిర్ధారించారు.
విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు కేవలం 208 ఓట్లు మాత్రమే రాకా వాటి విలువ 1,45,600 గా నిర్ధారించారు. పోలైన ఎంపీ ఓట్లలో 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు సాయంత్రం లోగా పూర్తి అవుతుంది. ఎంపీల ఓట్ల కౌంటింగ్ పూర్తి అయిన నేపథ్యంలో వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ట్విట్టర్ వేదికగా ద్రౌపది ముర్ముకు అభినందనలు తెలియజేశారు. తొలి ఆదివాసి మహిళ ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి అవుతున్నారంటూ అభినందనలు చెప్పారు.