జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో అయిదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీసుల సంయుక్త బృందాలు గాలింపు ప్రారంభించాయి. భద్రతా దళాలను చూసిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరపగా, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపాయి.
ఎన్ కౌంటర్ లో అయిదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా ఈ నెల 13న కుప్వారాలోని నియంత్రణ రేఖ సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైయ్యారు. అంతకు ముందు ఈ నెల 2వ తేదీన రాజౌరి జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైయ్యారు. ఈ నెలలో ఇప్పటి వరకూ మొత్తం 9 మంది ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ లో హతమైయ్యారు.