Karnataka: కరోనా సెకండ్ వేవ్ వైరస్ భీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 49 వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూడటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. కేవలం బెంగళూరు మహానగరంలోనే 23వేలకుపైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కొద్ది రోజులుగా కర్ఫ్యూ అమలు చేస్తున్నప్పటికీ కేసులు తగ్గుముఖం పట్టలేదు. విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ల అమలు నిర్ణయాధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చి సంగతి తెలిసిందే. దీంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆ దిశగా చర్యలు తీసుకున్నాయి. ఇప్పుడు తాజాగా కర్నాటక ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రకటించింది.
ఈ నెల 10వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు సీఎం యడ్యూరప్ప తెలిపారు. లాక్ డౌన్ ఈ నెల 24వ తేదీ వరకూ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు వంటివి తెచ్చుకునేందుకు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి పది గంటల వరకూ అనుమతిస్తారని అన్నారు. 10వ తేదీ నుండి 24వ తేదీ వరకూ రాష్ట్రంలోని అన్ని హోటళ్లు, పబ్ లు, బార్లు ఇతర వ్యాపార వాణిజ్య సంస్థలు మూతవేయాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి నారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. కరోనా కట్టడికి లాక్ పరిష్కారం కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించి 24 గంటలు గడవక ముందే కర్నాటకలో అక్కడి సిీఎం యడ్యూరప్ప ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.