Assembly Elections : శాసనసభ ఎన్నికల్లో భాగంగా తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. అదే విధంగా అసోంలో తుది దశ పోలింగ్, బెంగాల్ లో మూడో దశలో 31 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ రోజు జరుగుతున్న పోలింగ్ లో దాదాపు 20 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సందర్బంగా సమశ్యాత్మక, అతి సమశ్యాత్మక కేంద్రాల వద్ద భారీ బందోబస్సు ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు నేడు తొలి విడతలోనే ఎన్నికలు జరుగుతుండగా, 3,998 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం రాష్ట్రంలో 88,937 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికార ఏఐఏడీఎంకే, బీజేపీ, పీఎంకే, తమిళ మానిల కట్చి కూటమిగా ఏర్పడగా, డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఎండీఎంకే మరో కూటమిగా ఏర్పడి తలపడుతున్నాయి. మరోవైపు, ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ నేతృత్వంలోని ఎంఎన్ఎం, ఐజేకే, ఏఐఎస్ఎంకే, నామ్ తమిళర్ కట్చి పార్టీలు మరో కూటమిగా ఏర్పడి పోటీకి దిగాయి. టీటీవీ దినకరన్ కు చెందిన ఏఎంఎంకే, డీఎండీకే, ఎస్పీడీఐ నాల్గవ కూటమిగా బరిలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 6.28 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక్కడ అధికారం కైవశం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లకు భారీగా ఉచిత హామీలు ప్రకటించాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని మేరిస్ కాలేజీలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీనగర్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆవరణలో సీని ప్రముఖులు శివకుమార్, సూర్య, కార్తీక్, చెన్నై హైస్కూల్ లో కమల్ హాసన్, శృతి హాసన్, తేనంపేట్ లోని ఎస్ఐఈటీ కాలేజీలో స్టాలిన్, విరగంబాకంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై ఓటు హక్కు వినియోగించుకున్నారు. హీరో విజయ్ వెరైటీగా పోలింగ్ కేంద్రానికి సైకిల్ పై వచ్చి ఓటు వేశారు.
ఇక, కేరళలోనూ ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 957 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.74 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది.
పశ్చిమ బెంగాల్ లో మూడో దశలో భాగంగా 31 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఈ 31 స్థానాల్లో టీఎంసీ 29 స్థానాల్లో విజయం సాధించింది. ఈ రోజు జరిగే పోలింగ్ లో తారకేశ్వర్ స్థానం నుండి బీజేపీ సీనియర్ నేత స్వపన్ దాస్ గుప్తా బరిలో ఉన్నారు. శ్యామ్ పూర్ నుండి బీజేపీ అభ్యర్థిగా ప్రముఖ సినీ నటి తనుశ్రీ చక్రవర్తి బరిలో ఉన్నారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని 30 స్థానాలకు నేడు ఓకే దశలో పోలింగ్ కొనసాగుతోంది. పుదుచ్చేరిలో 10,04,197 మంది ఓటర్లు ఉన్నారు. పుదుచ్ఛేరిలో అధికారం కైవశం చేసుకునేందుకు ఎన్డీఎ ప్రత్యేక దృష్టి సారించింది. అసోంలో తుది విడత 40 స్థానాలలో ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మొత్తం 337 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.