Parliament Monsoon Session 2021: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ లో పలు సమస్యలపై నిలదీసేందుకు విపక్షాలు సిద్ధం అవుతున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పిలుపు మేరకు నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు మంత్రులు ఈ భేటీకి హజరైయ్యారు. పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు సజావుగా సహకరించాలని విపక్షాలను కోరేందుకు ఈ భేటీ నిర్వహించింది.
మరో వైపు దేశంలో నిత్యావసర, పెట్రో ధరల పెరుగుదల, సాగు చట్టాల రద్దు, కరోనా నియంత్రణలో వైఫల్యం, రఫేల్, చైనా సరిహద్దు వివాదాల వంటి అంశాలను లేవనెత్తాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సోనియా గాంధీ అధ్యక్షతన వర్చువల్ గా జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ ఎంపిలు పాల్గొన్నారు. ఉభయ సభల్లో తమ పార్టీ వైఖరి స్పష్టంగా తెలియజేసేందుకు లోక్ సభలో అదిర్ రంజన్ చౌధురి, రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో బందాలను ఏర్పాటు చేశారు.
మరో పక్క తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ అంశాన్ని లేవనెత్తాలని టిఆర్ఎస్ నిర్ణయించింది. అలాగే విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను ప్రస్తావించాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నది. పోలవరం నిధులు, విశాఖ ఉక్కు అంశాలపై కూడా ప్రశ్నించనున్నది. ఏపి ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాలను లేవనెత్తాలని టీడీపీ భావిస్తున్నది.
కాగా జూల 19 నుండి ఆగస్టు 13 వరకూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతుండగా, ఈ సెషన్ లో కేంద్రం 15 బిల్లులను పార్లమెంట్ ముందుకు తీసుకురానున్నది.