ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హరిద్వార్ జిల్లాలోని భీరంఖాల్ వద్ద పెళ్లి బృందం బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించినట్లు డీజీపిఅశోక్ కుమార్ మీడియాకు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 నుండి 50 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని 21 మందిని రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హరిద్వార్ జిల్లా లోని లాల్ గఢ్ నుండి బయలు దేరిన పెళ్లి బృందం బస్సు ప్రమాదానికి గురైంది.
విషయంలోకి వెళితే .. లాల్ గఢ్ కు చెందిన నందరామ్ వివాహం కోసం కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి బస్సులో బయలుదేరారు. బోరాఖాల్ ప్రాంతం నుండి సిమ్డీ గ్రామ సమీపంలోకి వచ్చే సరికి బస్సు అదుపుతప్పి లోయలో పడింది. బస్సు లోయలో పడిపోవడంతో ఎక్కువ మంది అక్కడికక్కడే మరణించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. 25 మంది మృత్యువాత పడ్డారు. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి రాష్ట్ర విపత్తుల నిర్వహణ కేంద్రానికి చేరుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అతివేగంతో వచ్చిన బస్సు బ్యారియర్లను దాటి చెట్టును ఢీకొని లోయలోకి పడినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
బస్సు ప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిగ్భాంతి వ్యక్తం చేశారు. తీవ్ర విషాదకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.