విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, తెలంగాణ సీఎం కేసిఆర్ ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సిరి సంపదలతో, ఆనంద, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు సీఎం జగన్. ప్రతి ఒక్కరి ఆశలు ఫలించి, ఆశయాలు నెరవేరాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
విజయ దశమి స్పూర్తి కొనసాగిద్దాం – కేసిఆర్
రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేసిఆర్ .. ధర్మ స్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయ దశమిగా దసరా పండుగను దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నారని అన్నారు. దసరా రోజున శుభ సూచకంగా పాలపిట్టను దర్శించి పవిత్రమైన జమ్మి చెట్టుకు పూజలు చేసే సాంప్రదాయం గొప్పదన్నారు. జమ్మి ఆకును బంగారంలా భావించి పంచుకొంటూ, పెద్దల ఆశీర్వాదాలను అందుకుంటూ , అలయ్ బలయ్ తీసుకొంటూ ప్రేమాభిమానాలను చాటుకోవడం దసరా పండుగ ప్రత్యేకత అని సీఎం కేసిఆర్ అన్నారు. అదే విధంగా ప్రతి పక్ష నాయకులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
మరో పక్క విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ సీఎం కేసిఆర్ ఈ మధ్యాహ్నం జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుని టీఆర్ఎస్ నేతలు సంబరాలు నిర్వహిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్ధిని ఈ రోజే కేసిఆర్ ప్రకటించనున్నారు.
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం .. లోయలో పడిపోయిన పెళ్లి బృందం బస్సు .. 25 మంది మృతి