వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డికి మరో సారి రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ జాబితాలో అవకాశం లభించింది. గత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పదవీ విరమణకు ముందు ఏర్పాటు చేసిన వైస్ చైర్మన్ ప్యానల్ లో విజయసాయిరెడ్డికి అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. వెంకయ్య నాయుడు పదవీ విరమణ తర్వాత ఉప రాష్ట్రపతి (రాజ్యసభ చైర్మన్) గా ఎన్నికైన జగదీప్ ధన్కర్ కొత్త వైస్ చైర్మన్ ప్యానల్ రూపొందించారు. ఈ నెలలో పార్లమెంట్ సమావేశాలకు ముందు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ మొత్తం ఎనిమిది మందితో వైస్ చైర్మన్ ప్యానల్ పునర్వ్యవస్థీకరించారు.
ఆ జాబితాలో విజయసాయిరెడ్డితో పాటు అస్సాంకు చెందిన భువనేశ్వర్ కవిత, కర్ణాటక నుండి ఎన్నికైన కాంగ్రెస్ సభ్యుడు డాక్టర్ ఎల్ హనుమంతయ్య, తమిళనాడు డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ, పశ్చిమ బెంగాల్ కు చెందిన టీఎంసీ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్, ఒడిసా బీజూ జనతాదళ్ సభ్యుడు డాక్టర్ సుస్మిత్ పాత్రో, చత్తీస్ ఘడ్ బీజేపీ సభ్యురాలు సరోజ్ పాండే, యూపీ బీజేపీ సభ్యుడు సురేంద్ర సింగ్ నాగర్ ఉన్నారు. అయితే సమావేశాల ప్రారంభం రోజున రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రకటించిన వైస్ చైర్మన్ జాబితాలో విజయసాయి రెడ్డి పేరు మిస్ అయ్యింది. కేవలం ఆయన ఏడుగురు పేర్లు మాత్రమే వెల్లడించారు.
దీంతో విజయసాయి వ్యతిరేక వర్గం వారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన ఫిర్యాదు నేపథంలోనే ప్యానల్ చైర్మన్ జాబితా నుండి విజయసాయి రెడ్డి పేరు తొలగించారంటూ ప్రచారం చేశారు. అయితే ప్రస్తుతం ఉభయ సభలు జరుగుతున్న తరుణంలో విజయసాయిరెడ్డి ప్యానెల్ వైస్ చైర్మన్ మరో సారి నామినేట్ అయ్యారు. విజయసాయిరెడ్డితో పాటు పీటీ ఉషకు ఈ అరుదైన అవకాశం కల్పించారు. ఈ మేరకు మంగళవారం సభలో చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రకటించారు.
రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ లో మరో సారి తనకు అవకాశం లభించడం పట్ల విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనపై అచంచల విశ్వాసంతో రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్ గా నియమించిన ఛైర్మన్ జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోడీలకు హదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తన బాధ్యతను అత్యంత ధర్మనిష్టతో నెరవేరుస్తానని విన్నవించుకుంటున్నానని పేర్కొన్నారు. సభ ప్రశాంతంగా, అర్థవంతంగా జరిగేలా తన వంతు కృషిచేస్తానని తెలిపారు. అదే విధంగా తనతో పాటు జాబితాలో ఉన్న మిగిలిన సభ్యులకు విజయసాయి శుభాకాంక్షలు తెలియజేశారు.
రాజ్యసభ చైర్మన్, వైస్ చైర్మన్ అందుబాటులో లేనప్పుడు వైస్ చైర్మన్ ప్యానల్ జాబితాలో ఉన్న సభ్యులు సభాపతి స్థానంలో కూర్చుని సభను నిర్వహించడం అనవాయితీ. గత సమావేశాల్లో విజయసాయిరెడ్డి సభాపతి స్థానంలో కూర్చుని సభ నిర్వహించారు. విజయసాయికి మరో సారి వైస్ చైర్మన్ ప్యానల్ లో అవకాశం లభించడం పట్ల ఆయన సన్నిహితులు, మిత్రులు, సహచర ఎంపీలు, పార్టీ నేతలు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ పరిణామం విమర్శకుల నోట్లో వెలక్కాయ పడినట్లు అయ్యింది.