మేడ్చల్ జిల్లాకు చెందిన పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యే లు మంత్రి మల్లారెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే మైనంపాటి హనుమంతరావు నివాసంలో నిన్న ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, వివేక్ గౌడ్, మాధవరం కృష్ణారావు, బి సుభాష్ రెడ్డి భేటీ అవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. జిల్లాలో మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష నిర్ణయాలపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశాలపై మంత్రి కేటిాఆర్, సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకువస్తామని వారు ప్రకటించారు. ఎమ్మెల్యేలు అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేసిన నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి తన దైన శైలిలో స్పందించారు.
ఇవి అన్నతమ్ముల మధ్య కుటుంబ గొడవలు లాంటివనీ, మీడియా వీటిని పెద్దవిగా చూపాల్సిన అవసరం లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మా కుటుంబ పెద్ద వీటిని పరిష్కరిస్తారని చెప్పుకొచ్చారు. పదవులు ఇచ్చేది కేసిఆర్, కేటిఆర్ తప్ప తాను కాదని మల్లారెడ్డి పేర్కొన్నారు. తాను గాంధేయవాదినని, ఎవరితోనూ గొడవ పెట్టుకునే రకం కాదని అన్నారు. తమది క్రమశిక్షణ కల్గిన పార్టీ అని వ్యాఖ్యానించిన ఆయన తమ ఇంటి సమస్యను పరిష్కరించుకుంటామని తెలిపారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల వద్దకు తానే వెళతాననీ, అవసరమైతే అందరినీ తన ఇంటికే ఆహ్వానిస్తానని వెల్లడించారు. తమ మధ్య పెద్ద స్థాయిలో సమస్యలు లేవనీ కొందరు కావాలనే పెద్దవి చేసి చూపిస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు.
మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష నిర్ణయాల కారణంగా తమ క్యాడర్ ఇబ్బందులు పడుతున్నారని, అసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్యేలు వాపోయారు. తమ తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను చర్చించి అధిష్టానం దృష్టికి తీసుకురావడానికే సమావేశమైయ్యామని ఆ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై నేడో రేపో కేటిఆర్ మాట్లాడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.