మద్రాస్: తమిళనాడులోని కడలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఒక పోలింగ్ కేంద్రంలో విచిత్రమైన పరిస్థితి నెలకొనడంతో ఆ పోలింగ్ కేంద్రంలో ఎన్నికను వాయిదా వేశారు.
పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు పక్కన ఓటు వేయడానికి అక్కడ బటన్ లేకపోవడంతో పోలింగ్ను వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పోలింగ్ అధికారుల అజాగ్రత్త చర్యల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది.
కడలూరు లోక్సభ ఎఎంఎంకె (టీటీవి దినకరన్ పార్టీ) అభ్యర్థిగా కాశీ తంగవేల్ పోటీ చేస్తున్నారు. ఈవిఎంలో ఆయన పేరు, గుర్తుకు 16వ స్థానం కేటాయించారు. అందుకు తగిన విధంగా ఈవిఎంలో అభ్యర్థి పేరు, పక్కన ఫోటో కూడా ఏర్పాటు చేశారు. ఓటర్లు ఎవరికి కావాలంటే వారికి ఓటు వేసుకునే విధంగా ఆ పేరు, గుర్తు పక్కన ఒక పచ్చ బటన్ ఉంటుంది. అయితే ఆ ఈవిఎంలో 15మంది అభ్యర్థుల పేర్ల పక్కన బటన్ ఉంది కానీ ఎఎంఎంకె అభ్యర్థి పేరు పక్కన బటన్ లేదు. దీంతో ఓటు వేయడానికి వెళ్లిన వారు దాన్ని గుర్తించి ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ విషయం పార్టీ నేతల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించారు. ఆ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ను వాయిదా వేశారు.
సాధారణంగా పోలింగ్ మొదలు పెట్టకముందే ఎన్నికల సిబ్బంది ఈవిఎంలను తనిఖీ చేస్తారు. మాక్ పోల్ నిర్వహించే సమయంలో ఇవిఎంలో ఉన్న అందరు అభ్యర్థుల పేర్లు పక్కన ఉన్న బటన్లు పని చేస్తున్నాయా లేదా, తదితర విషయాలను చెక్ చేస్తారు. ఈవిఎంలో అభ్యర్థి పేరు పక్కన బటన్ లేకపోవడాన్ని కూడా ఎన్నికల సిబ్బంది గుర్తించకపోవడంపై ఆ పార్టీ నేతలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.