మెగాస్టార్ చిరంజీవి, రాఘవ లారెన్స్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ అనుబంధంతో లారెన్స్ హైదరాబాద్లో ప్రారంభించిన లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్కు 10 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. రాఘవ లారెన్స్, ఓవియా, వేదిక, కొవైసరళ, శ్రీమాన్ ప్రధాన తారాగణంగా నటిస్తోన్న చిత్రం ‘కాంచన 3’. లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రమిది. రాఘవేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్లో రాఘవ నిర్మాణంలో ఈ సినిమా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలవుతుంది. తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మధు విడుదల చేస్తున్నారు. బుధవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో లారెన్స్ చారిట్రబుల్ ట్రస్ట్ బ్రోచర్ను అల్లు అరవింద్ విడుదల చేశారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ – ”లారెన్స్ ఓ బ్రాండ్లా తయారయ్యాడు. అతని సినిమా వస్తుందంటే, అందరూ వెయిట్ చేస్తున్నారు. కేవలం డబ్బు సంపాదించాలనే ఉద్దేశం లారెన్స్కు లేదు. సంపాదించిన దాన్ని పది మందికి పంచాలనుకుంటాడు. చిరంజీవిగారు తన శిష్యుడ్ని అభినందిస్తూ 10 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఆయన తరపున నేను లారెన్స్కు చెక్కును అందిస్తున్నాను” అన్నారు. రాఘవ లారెన్స్ మాట్లాడుతూ ”ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న ఠాగూర్ మధుగారికి కూడా థాంక్స్. ఈ సినిమా మంచి పేరు, డబ్బులు తెచ్చి పెట్టాలి. ఇక నన్ను ఇంతలా ఎంకరేజ్ చేసిన ఆడియెన్స్కు ఏదైనా చేయాలి. ఆలోచించి చారిట్రబుల్ ట్రస్ట్ను స్టార్ట్ చేశాను. అలాగే నేను డ్యాన్స్ మాస్టర్గా ఎదిగింది తెలుగు రాష్ట్రాల్లోనే కదా.. మంచి సమయం చూసి చారిట్రబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉండేది. మా అమ్మ ఆశీర్వాదంతో ఇక్కడ కూడా చారిట్రబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేశాను. 60 మంది పిల్లల్ని చదివించడం అంటే ఎక్కడో బయట పెట్టుకుని చేయొచ్చు. కానీ అలా కాకుండా వారిని నా ఇంట్లోనే పెట్టుకుని చదివిస్తున్నాను. ఈ ట్రస్ట్కు నా వంతుగా 50 లక్షల రూపాయల విరాళాన్ని అందిస్తున్నాను. ఓపెన్ హార్ట్ సర్జరీ సమస్య ఉన్నవాళ్లు, చదువు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ట్రస్ట్ స్టార్ట్ చేస్తున్నానని చిరంజీవి అన్నయ్యకు చెప్పగానే ఆయన పది లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఆయన నాకు మనిషి రూపంలోని దేవుడు. ఆయన ఆశీర్వాదం ఉంటే.. ఈ చారిట్రబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి పనులు చేయాలనుకుంటున్నాను” అన్నారు.
previous post