RRR: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై ఎలాగైనా సరే అనర్హత వేటు వేయించాలన్న పట్టుదలతో ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది.ఈ నెల పందొమ్మిది వ తేదీ నుండి జరుగనున్న పార్లమెంటు సమావేశాల్లోనే రఘురామ కృష్ణంరాజుకు చెక్ పెట్టడానికి తెరవెనక తతంగం నడుపుతోంది. ముఖ్యమంత్రి జగన్ పాలనను విమర్శిస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ను అనర్హుడిగా ప్రకటించాలంటూ వైసిపి తీవ్రస్థాయిలో లోక్సభ స్పీకర్ పై ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే.
సంవత్సర కాలంగా తమ పిటిషన్ పెండింగ్ లోఉందని, ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోకుంటే పార్లమెంటును స్తంభింపజేస్తామని వైసీపీ అగ్ర నేత విజయసాయిరెడ్డి స్పీకర్ ఓం బిర్లాకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది.ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ నిన్న ఒక వివరణ ఇచ్చారు.వైసిపి పిటిషన్ స్పీకర్ సెక్రటేరియట్ పరిశీలనలో ఉందన్నారు.అయితే ఇరు పక్షాల వాదనలు విన్నాకే తాను ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ చెప్పడం జరిగింది.దీంతో ఈ విషయంలో జాప్యం జరిగే అవకాశముందని భావించిన వైసిపి మళ్లీ తన వ్యూహానికి పదును పెట్టింది.
300పేజీలతో ఆర్ఆర్ఆర్ చిట్టా తయారీ!
ఇందులో భాగంగా రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాల చిట్టాను మూడు వందల పేజీలు తయారుచేసి స్పీకర్ కార్యాలయానికి పంపినట్లు రాజమండ్రి వైఎస్సార్సీపీ ఎంపీ ,లోక్సభలో పార్టీ విప్ మార్గాని భరత్ మీడియాకు తెలిపారు.రఘురామకృష్ణంరాజు వైసీపీ వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, వీటిని సాక్ష్యాధారాలతో లోక్ సభ స్పీకర్ కు సమర్పించామని ఆయన చెప్పారు.తాము ఇచ్చిన ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ నుంచి వారం రోజుల్లో రఘురామ కృష్ణంరాజుకు నోటీసులు వస్తాయని మార్గాని భరత్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో శరద్ యాదవ్ పై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వేటు వేసిన విషయాన్ని కూడా స్పీకర్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. ఒకవేళ స్పీకర్ ఆయన వివరణ కూడా తీసుకున్నప్పటికీ తాము సమర్పించిన సాక్ష్యాధారాలు బలంగా ఉన్నందున రఘురామకృష్ణంరాజు పై వేటు పడటం ఖాయమని రాజమండ్రి ఎంపీ తెలిపారు.మొత్తంగా చూస్తే రఘురామ కృష్ణంరాజు విషయంలో అమీతుమీకి వైసిపి సిద్ధపడినట్లు కనిపిస్తోంది. అవసరమైతే పార్లమెంటులో ఇదే విషయాన్ని ప్రధానంగా ఆ పార్టీ టేకప్ చేయనున్న సూచనలు కనిపిస్తున్నాయి