తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా ఎదగాలని ఎత్తులు వేస్తూ అందుకు తగిన సన్నాహాలు చేస్తున్న బీజేపీ ఇందులో భాగంగా తనకు అనుకూలించే ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు.
ముఖ్యంగా ప్రచారం విషయంలో పక్కాగా వ్యవహరిస్తోంది బీజేపీ. ఈ క్రమంలో తాజాగా స్టార్ క్యాంపెయినర్లలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
గ్రేటర్ స్పెషల్ ఫోకస్
ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ హైదరాబాద్కు వచ్చి బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయడమే కాకుండా టీఆర్ఎస్ గత మేనిఫెస్టోపైనా చార్జ్ షీట్ విడుదల చేశారు. దీంతో పాటుగా టీఆర్ఎస్ పరిపాలనపై విమర్శలు గుప్పించారు. తద్వారా కొత్త అటెన్షన్ సృష్టించారు.
స్టార్ క్యాంపెయినర్లు….
గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది కమలం పార్టీ. ఇందులో భాగంగా, స్టార్ క్యాంపెయినర్లుగా ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలను ప్రచార బరిలోకి దించి రోడ్ షోలు నిర్వహించేలా బీజేపీ ప్రణాళిక రచించింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సహా మరో ఇద్దరు కేంద్ర మంత్రులతో ప్రచారం చేయించనున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రచార బరిలోకి దిగనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ క్రికెటర్, ఎంపి గౌతం గంభీర్, ఇటీవలె బీజేపీలో చేరిన సినీ నటి ఖుష్బులతో కూడా గ్రేటర్ ఎన్నికల ప్రచారం చేయించేందుకు ఆహ్వానం పంపినట్లు సమాచారం.
ఇప్పటికే ఆయన…
మరోవైపు యువ నేతలను సైతం బీజేపీ ప్రచారం బరిలోకి దింపుతోంది. బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఛేంజ్ హైదరాబాద్ క్యాంపెయిన్ లోకల్ బాడీ ఎన్నికలకే పరిమితం కాదని అన్నారు. తెలంగాణలో మార్పునకు ఛేంజ్ హైదరాబాద్ నాంది అవుతుందన్నారు. ఇవ్వాళ మొత్తం దేశం హైదరాబాద్ వైపు చూస్తోందని తేజస్వీ సూర్య న్నారు. హైదరాబాద్లో మార్పు తీసుకొచ్చే వాతావరణం కనిపిస్తోంది. దీనికి సామాన్య బీజేపీ కార్యకర్తలే కారణమని ఆయన విశ్లేషించారు.
విజయశాంతితో…
మరోవైపు కాంగ్రెస్ పార్టీకి విజయశాంతి గుడ్బై చెప్పారు. ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచార బరిలోకి దిగనున్నారు. మొత్తంగా ఇటు సినీ తారలు, అటు క్రికెటర్లు , సుప్రసిద్ధ నాయకులతో ప్రచారం చేయించి గ్రేటర్లో తమ సత్తా చాటేలా బీజేపీ గేమ్ మొదటుపెట్టిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.