నిత్యానంద స్వామి అందరికీ గుర్తుండే ఉంటాడు.ఒక ప్రముఖ టాలీవుడ్ నటి తో ఆ ఆయన సాగించిన రాసలీలల వీడియోలు బయటికొచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా సదరు స్వామీజీ విదేశాలలో ఏకంగా ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసి అందులో ప్రత్యేక సామ్రాజ్యాన్ని నెలకొల్పుకోవటం,చివరకు ఆ ద్వీపంలో చెలామణి అయ్యే ప్రత్యేక కరెన్సీని రూపొందించుకోవటం కూడా జరిగింది. పిచ్చి ముదిరింది .రోకలి తలకు కట్టండి అన్న చందంగా ఈ స్వామీజీ తంతు ఉంది.కేఏ పాల్ మాదిరి నిత్యానందస్వామి కూడా కామెడీ చేస్తున్నారన్న కామెంట్లు వస్తుంటాయి.అలాంటి కామెడీ పీస్ నిత్యానంద స్వామి గురించి ఇప్పుడెందుకు చెప్పుకోవాలి అంటారా?మరి హైద్రాబాద్ లోని ఒక స్వామీజీ కారణంగా నిత్యానంద స్వామి ని గుర్తుకు తెచ్చుకోవాల్సి వస్తోంది. వివరాల్లోకి వెళితే …మణికొండ లో ఆశ్రమం నిర్వహించే ప్రదీప్ జోషీ అనే స్వామీజీ మీద సాక్షాత్తు ఆయన భార్య సీసీఎస్ మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.అతను స్వామీజీ ముసుగులో అనేక మంది మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకొని తనను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
నిత్యానంద స్వామి మాదిరే స్వంత సామ్రాజ్యం నెలకొల్పడం తన ధ్యేయమని ప్రదీప్ జోషిఎప్పుడూ చెబుతుంటాడని,రోజంతా నిత్యానంద స్వామి వీడియోలు చూస్తుంటాడని ఆమె పోలీసులకు తెలిపింది.తనను పెళ్లి చేసుకోవడానికి ముందే ప్రదీప్జోషి రెండు వివాహాలు అయ్యాయని ఆ విషయాన్ని దాచిపెట్టి తనను మళ్లీ గత ఏడాది మార్చిలో వివాహమాడాడని చెప్పింది.తిరుపతి అహోబిలమఠంలో తమ వివాహం జరిగిందని ఈ సందర్బంగా తన వద్ద నుండి పదిహేను లక్షల రూపాయలు విలువ చేసే బంగారు వెండి ఆభరణాలను ప్రదీప్ జోషి తీసుకున్నాడని ఆమె వెల్లడించింది.
హైదరాబాద్తోపాటు బెంగుళూరులో కూడా ఆశ్రమాలు నిర్వహిస్తూ మహిళలను ట్రాప్ చేస్తున్నాడని ఆమె వివరించింది.ఈ విషయాలన్నీ తెలియడంతో తాను నిలదీయగా వేధింపులకు గురి చేస్తున్నాడని వాపోయింది .తనకు రాజకీయంగా పలుకుబడి ఉందని ,పోలీసులను మేనేజ్ చేస్తానని , మీడియా కూడా తన చేతిలోనే ఉందని నువ్వేమీ చేయలేవు అంటూ అతను తన బెదిరిస్తున్నట్లు ఆమె చెప్పింది.ప్రదీప్ జోషి రహస్యాలన్నీ తనకు తెలిసినందున అతడు తననేమయినా చేయవచ్చునని తనకు రక్షణ కల్పించాలని కూడా ఆమె కోరింది ఈ మేరకు సీసీఎస్ మహిళా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.