అందరూ అనుకున్నది జరిగితే అది బీజేపీ ఎందుకవుతుంది…??
విశ్లేషకులు ఊహించుకున్నట్టు చేస్తే అది బీజేపీ ఎందుకవుతుంది…!
అందరూ ఐక్యంగా సబ్జెక్టు మాట్లాడితే అది బీజేపీ ఎందుకవుతుంది…? అందులోకి ఏపీ బీజేపీ ఎందుకవుతుంది…? ఇంతకూ విషయం ఏమిటంటే ఏపీ బీజేపీలో మళ్ళీ కొత్త గేమ్ మొదలయ్యింది. నాయకులూ బిజీ గా గడిపేస్తున్నారు. అందుకే కొద్దిరోజులుగా కన్నా సైలెంట్ అయ్యారు, మాధవ్ జాడ లేదు, పురంధేశ్వరి అసలు దొరకట్లేదు…! అందరూ ఎవరి పనుల్లో వారున్నారు. ఆ పార్టీలో ఏపీ అధ్యక్షుడి మార్పు అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. అందుకే బిజీలు, హడావిడి, లాబీయింగులు, సైలెన్సులు…!
తెరపైకి కొత్త సమీకరణాలు…!
నిజానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఉండదని అంతా అనుకున్నారు. జరిగితే మర్చి, ఏప్రిల్ లోనే జరిగిపోవాలి. కానీ జరగలేదు, కన్నాకు మరో రెండేళ్లు డోకా లేదు అనుకున్నారు. ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ ఈ అంశం తెరపైకి వచ్చింది. దానికి కారణం పరిశీలిస్తే కన్నాకు వ్యతిరేక బ్యాచ్ తయారవ్వడమే. సామజిక వర్గాల పరంగానూ ఇక్కడ మార్పులు చేస్తే బాగుంటుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారట అందుకే మరో వారంలో ఈ మార్పులు ఉండవచ్చని సంకేతాలు వస్తున్నాయి. జనసేన తో కలిసి నడుస్తున్నందున కాపు సామాజికవర్గంతో వారికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అందుకే మరో కీలక సామాజికవర్గంగా ఉన్న కమ్మ సామాజికవర్గంలో ఒకరికి ఇవ్వాలని యోచిస్తున్నారట.
కమ్మ జపానికి కారణాలివే…!
ఒకవేళ కమ్మ సామాజికవర్గంలో ఇవ్వాలి అనుకుంటే పురంధేశ్వరి, సుజనా చౌదరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సుజనా కొత్తగా చేరడం.., అతనిపై ఇంకా పసుపు నీడ ఉండడంతో అతన్ని పక్కన పెట్టేసి, పురంధేశ్వరి పేరు ముందు వరుసలో ఉంటుంది. మరోవైపు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తుంది. ఇటీవల ఆయన పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్నారు. * ముఖ్యమైన అంశం ఏమిటంటే… కమ్మ సామాజికవర్గాన్ని జగన్ టార్గెట్ చేస్తుండడంతో… ఆ వర్గంలో ఒకరికి పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చి.., వారిలో బాగా పట్టున్న టిడిపి నాయకులను బీజేపీలో చేర్చుకుని వచ్చే ఎన్నికల నాటికి జగన్ (రెడ్డి) లకు వ్యతిరేకంగా చంద్రబాబు (కమ్మ) కంటే తాము (జనసేన – కాపు.., కమ్మ) మంచిదని, బలంగా ఉన్నామని ప్లాన్ వేస్తున్నారు. అన్నిటికంటే మరో కీలక అంశం ఏమిటంటే… ఇటీవల నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో బీజేపీ నేత కామినేని కేసు వేయడం, గెలవడంతో కమ్మ సామాజికవర్గానికి బీజేపీ పై ఒక నమ్మకం ఏర్పడింది. అందుకే ఈ వర్గంలో ఒకరికి పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చినా ఆశ్చర్యం లేదు.
కన్నా అందుకేనా సైలెంట్…!
కన్నా లక్ష్మీనారాయణ పనితీరుపై బీజేపీ పెద్దలు సంతృప్తిగానే ఉన్నారు. కానీ అనూహ్యంగా అతని వ్యతిరేక వర్గం నుండి పిర్యాదులు వెళ్తున్నాయి. రాష్ట్రంలో వైసిపితో కూడా కన్నా సూటిగా వ్యవహరిస్తూ నేరుగా ఢీకొడుతున్నారు. నిజానికి ఇది వైసిపి – బీజేపీ రహస్య బంధానికి చెక్ పెట్టేలా ఉందని కొందరు చెప్పుకుంటున్నారు. మొన్నామధ్య విజయసాయితో నేరుగా విమర్శలకు దిగడం, మళ్ళీ సైలెంట్ అయిపోవడం… ఇలా కన్నా నాయకత్వం విషయంలో ఈ మధ్య కొన్ని పిర్యాదులు వెళ్లాయి. మొత్తానికి కన్నా వ్యతిరేక వర్గం లాబీయింగులు పని చేయకుండా.., కమ్మ మంత్రం జపం ఆపేస్తే ఈ సారికి కన్నానే కొనసాగించే అవకాశం ఉంది. ఏది ఏమవుతుందో… మరో వారం, పది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.