YS Jagan: ఏపీలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో 4జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో 300 సెల్ టవర్ లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ గా గురువారం ప్రారంభించారు.
మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్ధవంతమైన టెలికాం సేవలు అందించేందుకు ఎయిర్ టెల్ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లు ఏర్పాటు చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44, ప్రకాశం జిల్లాలో నాలుగు, శ్రీకాకుళం జిల్లాలో రెండు, కాకినాడ జిల్లాలో ఒకటి టవర్ ఏర్పాటు అయ్యాయి.
ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. జూన్ లో వంద టవర్లు ఏర్పాటు చేయగా, ఇవేళ మరో టవర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దాదాపు రూ.400 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ టవర్ ల వల్ల 2.42 లక్షల మందికి ప్రయోజనం కలుగుతోందన్నారు. మొత్తంగా కలిపి 2887 టవర్లు ఏర్పాటు చేస్తున్నామనీ, వీటి కోసం రూ.3,119 కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా చెప్పారు.
టవర్లకు అవసరమైన భూములను వెంటనే అప్పగించడం జరిగిందన్నారు. 5549 గ్రామాలకు పూర్తి మొబైల్ టెలికాం సేవలు అందుతాయన్నారు. అత్యంత మారుమూల ప్రాంతాలు నెట్ వర్క్ పరిధిలోకి వస్తాయని, సమాచార సంబంధాలు బాగా మెరుగుపడతాయని తెలిపారు. ఈ ప్రాంతాలకు పథకాల అమలు మరింత సులభతరం అవుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ఐటీశాఖ కార్యదర్శి కోన శశిధర్, కమ్యూనికేషన్స్ (ఐటీశాఖ) డైరెక్టర్ సి చంద్రశేఖర్ రెడ్డి, భారతీ ఎయిర్టెల్, రిలయెన్స్ సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు.
Breaking: ఈ నెల 31న ఏపీ కేబినెట్ భేటీ