AP CM YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు ముగిసాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్ తో సమావేశమై పిఆర్సీతో సహా 70 డిమాండ్ లను విన్నవించారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని 13 ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశానికి హజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్ సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాలతో సమావేశంలో చర్చించిన అంశాలను సీఎం జగన్ మీడియాకు వెల్లడించారు.
AP CM YS Jagan: రెండు మూడు రోజుల్లో ప్రకటన
ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్ చేసుకున్నానని జగన్ పేర్కొన్నారు. అన్ని సమస్యలు సరిదిద్దేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వం మోయలేని విధంగా భారం ఉండకూడదనీ ఈ విషయంలో ఉద్యోగ సంఘాలు కూడా ప్రాక్టికల్ గా ఆలోచించాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. ఉద్యోగ సంఘాలు సానుకూల దృక్పదంతో ఉండాలని కోరిన జగన్ .. ఎంత మంచి చేయగలిగితే అంత చేస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు మంచి చేయాలన్న తపనతో ఉన్నామన్నారు. ఉద్యోగ సంఘాలు 27 నుండి 55 శాతం వరకూ రకరకరాలుగా ఫిట్ మెంట్ అడిగారు. అందరి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. రెండు మూడు రోజుల్లో ప్రకటన విడుదల చేస్తామని సీఎం జగన్ తెలిపారు.
సమావేశంలో ఏపి జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపి జేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి, తదితరులు చర్చలో పాల్గొన్నారు.
Read More: PRC: క్లైమాక్స్ దశకు చేరుకున్న ఉద్యోగుల అంశం..! నేడు సీఎం జగన్ తో భేటీ..!!